అమరావతి గ్రాఫిక్స్ కదా.. బిల్డింగ్ పై నుంచి దూకి నిరూపించు-సాయిరెడ్డికి బుద్దా సవాల్...
అమరావతిని రాజధానిగా టీడీపీ ప్రకటించిన నాటి నుంచీ అదో గ్రాఫిక్స్ మాయాజాలం అంటూ వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇప్పుడు అధికార పక్షంగా ఉంది. గ్రాపిక్స్ విమర్శలు మాత్రం కామనే. అయితే ఈ విమర్శలకు టీడీపీకి సూటిగా గుచ్చుకుంటున్నా పలు సందర్భాల్లో కౌంటర్లు కూడా ఇస్తూనే ఉంది. తాజాగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు ఆ పార్టీ ఇచ్చిన కౌంటర్ మాత్రం కాస్త విచిత్రంగా ఉంది.
అమరావతి గ్రాఫిక్స్ అంటున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఓ ఛాలెంజ్ విసిరారు. అమరావతిని గ్రాఫిక్స్ అని చెబుతున్న సాయిరెడ్డి అక్కడ చంద్రబాబు కట్టిన భవనం పై నుంచి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించాలని సూచించారు.
మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట మొదలుపెట్టి ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, విశాఖలో రాజధాని కట్టేది మీరా అంటూ సాయిరెడ్డిని తన ట్వీట్ లో బుద్ధా కడిగి పారేశారు.
అంతటితో ఆగకుండా అమరావతి గ్రాఫిక్స్ బిల్డింగ్ పై నుంచి దూకేందుకు సిద్దమై ఎప్పుడు వస్తారో చెబితే బిల్డింగ్ కింద మీడియాతో పాటు వేచి చూస్తానంటూ బుద్దా వెంకన్న తన ట్వీట్ లో పేర్కొన్నారు. గతంలో అమరావతి గ్రాఫిక్స్ విమర్శలకు పలుమార్లు కౌంటర్ ఇచ్చిన టీడీపీ..ఈసారి వింత ప్రతిపాదనను ఎంపీ సాయిరెడ్డి ముందు పెట్టడంతో దీనికి ఆయన ఎలా స్పందిస్తారన్న ఆసక్తి నెలకొంది.