జగన్ అతీతుడు కాదు: వైయస్ చేయని సాహసం నేడు : ఎందుకీ భజన...అవి ఆయనవి కావా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు స్వీకరించి 45 రోజులు అయింది. ఆయన మీద ఎన్నో ఆశలతో ఏకంగా 151 సీట్లు ఓటర్లు కట్టబెట్టారు. జగన్ సైతం తాను ఖచ్చితంగా ప్రజలు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా పని చేస్తానని చెప్పారు. గతంలో ప్రభుత్వం అన్ని పధకాలకు ఎన్టీఆర్ పేరు పెడితే..ఈ ప్రభుత్వంలో అన్ని పధకాలకు వైయస్సార్ పేరును ఖరారు చేసారు. అంత వరకు బాగానే ఉంది. పార్టీ పేరే వైయస్సార్సీపీ కావటంతో పధకాలకు..అందునా ప్రజలతో మమేక మైన నేత కావటంతో ఆయన పేరు పెట్టటంలో అభ్యంతరం లేదు. కానీ, నాడు వైయస్సార్ అన్ని పధకాలు అమలు చేసినా చేయని సాహసాన్ని ఇప్పుడు తనయుడు జగన్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చేసారు...
జగన్ను ప్రాధేయపడ్డ ఆర్థిక మంత్రి..! ససేమిరా అన్న సీఎం..!! ఎట్టకేలకు అంగీకారం
Recommended Video
రెండ పధకాలకు జగన్ పేరు..
వైపీపీ ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. అందులో సంక్షేమ రంగానికే దాదాపు 70 వేల కోట్లకు పైగా కేటాయిం పులు చేసింది. అదే విధంగా నవ రత్నాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. జగన్ ఇచ్చిన హామీల్లో దాదాపు 80 శాతం వరకు తొలి బడ్జెట్లోనే నిధులు కేటాయించారు. ఇదంతా జగన్కు మంచి పేరు తెచ్చే విధంగానే రూపొందించారు. అయితే, ఇక నవ రత్నాల్లో భాగంగా అమ్మ ఒడి పధకానికి ఏకంగా 6,455 కోట్లు కేటాయించారు. అందరూ ప్రశంసించారు. అదే విధంగా విద్యా దీవెన పధకానికి 4,962 కోట్లను ప్రతిపాదించారు. ఇది విద్యార్దులకు మేలు చేసే పధకం. ఈ రెండు పధకాల ద్వారా విద్యాభి వృద్ది..ప్రతీ ఇంటా అక్షరాస్యత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ రెండు పధకాలకు జగన్ పేరు ఖరారు చేయటం పైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. అందునా..జగన్ కు ఇష్టం లేకపోయినా తామే ఒప్పించామని ఆర్దిక మంత్రి బుగ్గన తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.
మిగిలిన పధకాలు జగన్ వి కావా..
తన ప్రసంగంలో బుగ్గన అమ్మ ఒడి పధకం దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైనదని..దీని కారణంగానే జగనన్న అమ్మ ఒడిగా పేరు ఖరారు చేసామని..అదే విధంగా జగనన్న విద్యా దీవెన పేరు పెట్టామని ప్రకటించారు. గతంలో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రన్న పేరుతో కొన్ని పధకాలను అమలు చేసారు. అయినా..ఆయనకు అది ఏ రకంగానూ మేలు చేయకపోగా..రాజకీయంగా నష్టం చేసింది. మంత్రులు చేసే భజనలో భాగంగా నాడు కూడా పధకాల కు చంద్రన్న పేరు పెట్టాల్సి వచ్చింది. చంద్రన్న పేరు పెట్టటం పైన నాడు వైసీపీనే విమర్శలు చేసింది. ఇక, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కూడా కాలేదు. తొలి బడ్జెట్ మాత్రమే ప్రవేశ పెట్టారు. ఆ సమయంలోనే ఇలా మంత్రులు తాము ఒత్తిడి చేసామని..అందుకే జగన్ అంగీకరించారని చెబుతున్నా..అప్పుడే జగన్ పేరుతో పధకాలు అమలు చేయటం మాత్రం ఖచ్చితంగా విమర్శలకు దారి తీసేదే. ఈ రెండు పధకాలకు జగన్ పేరు పెట్టిన మంత్రులు ..నవ రత్నాలు..మిగిలిన పధకాలు జగన్ వి కావా. ఆయన పేరు పెడితేనే సీఎంకు గుర్తింపు వస్తుందా..
వైయస్ చేయని సాహసం..
2004-2009 వరకు వైయస్ ముఖ్యమంత్రిగా పని చేసారు. అంతకు మందు ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పధకాలు అమలు చేసారు. అన్ని పధకాలకు ఇందిరా..రాజీవ్ పేరు పెట్టారు. ఆయన అమితంగా అభిమానించే సోనియా పేరు కూడా ఎక్కడా పెట్టలేదు. అదే విధంగా పదేళ్ల పాటు యుపిఏ..రెండో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కానీ ఎక్కడా ప్రధానుల పేర్లతో పధకాలను అమలు చేయటం లేదు. ప్రధాని పదవి పేరుతో మాత్రమే కొన్నింటిని అమలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా పేర్లు మాత్రం పెట్ట లేదు. ఇక, ఇప్పుడు జగన్ టీడీపీ పాలన కంటే భిన్నంగా.. లో ప్రొఫైల్ తో పాలన చేస్తున్నారనే అభిప్రాయం నడమ..రెండు నెలల్లోగానే ఆయన పేరుతో పధకాలు ప్రకటించారు. జగన్ నాయకత్వానికి ప్రజలు ఓటు వేసినప్పుడు ఆయన ప్రభుత్వంలో ఏది చేసినా ఆయనకే ఇమేజ్ వస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా రెండు పదకాలకే ఆయన పేరు పెట్టటం ద్వారా విమర్శలు మినహా కొత్తగా ఒనగూరే ప్రయోజనం ఏంటో అంతగా ఒప్పించిన మంత్రులే సమాధానం చెప్పాలి.