జగన్ సర్కారుకు సుప్రీంలో షాక్ -అమరావతిలో ఇళ్ల స్ధలాలపై హైకోర్టు ఉత్తర్వుల సమర్ధన...
ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ వ్యవహారం ఇప్పట్లో తెమిలేలా కనిపించడం లేదు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములను పేదల ఇళ్ల స్ధలాల కోసం పంపీణీ చేసేందుకు జగన్ సర్కారు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఇప్పటికే సస్పెండ్ చేయగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్ధించింది.
కృష్ణా, గంటూరు జిల్లాల్లో పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం అమరావతిలో రాజధాని రైతుల నుంచి సేకరించిన భూములు ఇవ్వాలని గతంలో ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. అయితే వీటిని హైకోర్టు ఇప్పటికే సస్పెండ్ చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ధర్మాసనం దీన్ని విచారించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించిన సుప్రీంకోర్టు.. ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్)పై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుపై హైకోర్టు విచారణ సరిగానే జరిగిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే అభిప్రాయపడ్డారు. దీంతో హైకోర్టులో దీనిపై తుది విచారణ ముగించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం అమరావతిలో భూములను పేదలకు పంచే అవకాశం లేకుండా పోయింది. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ఇక్కడ భూములు కేటాయించిన పేదలకు ఇప్పుడు మరో చోట భూములు వెతకాల్సిన పరిస్ధితి తలెత్తింది.