టీడిపి ప్రభుత్వంపై విచారణ జరిపించండి..! ఏపి సీఎం ను కోరిన బీజేపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!!
అమరావతి/హైదరాబాద్ : గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగిందని, వాటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ను కోరినట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. అంతేకాదు..వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలోనూ మాజీ సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వీర్రాజు.. శాసనమండలిలో రాజధాని విషయంపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన ప్రసంగాన్ని తోసిపుచ్చారు. 'సభలో రాజేంద్రప్రసాద్కు నాలుగు గంటల సమయం ఇస్తే.. రాజధాని, రాజధాని అంటూ మాట్లాడారని, అసలు ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని గురించి చర్చించిన సందర్భం ఉందా?' అని ప్రశ్నించారు.
శాసనమండలిలో అనవసర చర్చ చేస్తూ ప్రజా ధనాన్ని, సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. చదరపు అడుగుకు 10,000 రూపాయల చొప్పున ఖర్చుచేసి అసెంబ్లీ నిర్మాణం చేపట్టినా.. నిర్మాణంలో ఏమాత్రం నాణ్యత లేదని ఆరోపించారు. చిన్న వర్షం పడితేనే అసెంబ్లీ పైకప్పు లీక్ అవుతోందని, తామంతా తడిసిపోతున్నామని అన్నారు. రైతుల వద్ద ధాన్యం నేరుగా కొనకుండా మిల్లర్ల చేత కొనిపించారని గత ప్రభుత్వ విధానాలను సోము వీర్రాజు తూర్పారబట్టారు. రైతులకు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా 2 సంవత్సరాల నుండి రైతులకు ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టులు కూడా తాకట్టుపెట్టి రుణం తీసుకోవడానికి ప్రయత్నించారని దుమ్మెత్తిపోశారు. సీబీఐని రాష్ట్రానికి రాకుండా నిలువరించిన మాజీ సీఎం చంద్రబాబు.. ఇక్కడి డీఐజీతో ప్రత్యర్థులందరిపై దాడులు చేయించారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు సహా అనేక కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని, వీటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ను కోరామని వీర్రాజు చెప్పారు.