8 లక్షలు విరాళంగా గుడికి ఇచ్చిన యాచకుడు: బిచ్చగాడి ఔదార్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే !!
కోట్లకు పడగలెత్తి ఉన్నా ఎంగిలి చేత్తో కాకిని తోలని వాళ్ళు ఉన్న నేటి రోజుల్లో ఓ యాచకుడు తన విశాల హృదయాన్ని ప్రదర్శించాడు. ఎంత సంపాదించినా నాది అన్న స్వారధంతో దాచుకునే వాళ్ళు ఉన్న నేటి రోజుల్లో ప్రజల నుండి యాచన చేయగా వచ్చిన దాన్ని ఆలయాలకు విరాళంగా ఇస్తూ తన ఉదార హృదయాన్ని చూపిస్తున్నాడు విజయవాడకు చెందిన ఓ యాచకుడు .
భిక్షాటన చేసి జీవనం సాగించే యాదిరెడ్డి ఔదార్యం
ఆలయాల ముందు భిక్షాటన చెయ్యగా వచ్చిన డబ్బుల్లో తన ఆహారానికి ఖర్చు పెట్టినవి పోగా మిగిలిన డబ్బులు జాగ్రత్తగా గుడులు, గోపురాలకు విరాళంగా ఇస్తున్నాడు విజయవాడలో భిక్షాటన చేసే యాది రెడ్డి . నల్గొండ జిల్లాకు చెందిన యాదిరెడ్డి అనే 75 సంవత్సరాల యాచకుడు చేస్తున్న ఈ ధర్మ కార్యం స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు రిక్షా లాగుతూ జీవనం సాగించిన యాదిరెడ్డి , కాళ్ళ మోకాలి చిప్పలు అరిగిపోవటంతో ఆలయాల వద్ద భిక్షాటన చేసి జీవనం సాగిస్తున్నాడు.
ఏ గుడి ముందు అయితే యాచించాడో ఆ గుడికి భారీ విరాళం
ఏ గుడి ముందు అయితే బిచ్చం ఎత్తుకున్నాడో ఆ గుడికి భారీ విరాళం ఇచ్చి అందరిని ఆశ్చర్య పోయేలా చేశాడు యాదిరెడ్డి . విజయవాడలోని ముత్యాలంపాడులో ఉన్న సాయిబాబా ఆలయం వద్ద చాలా కాలంగా భిక్షాటన చేస్తున్నాడు యాదిరెడ్డి . ఇక చాలా కాలంగా ఆయన యాచన ద్వారా సేకరించిన 8 లక్షల రూపాయలు ఆలయానికి విరాళంగా ఇచ్చారు. విజయవాడలో ఆలయాల ముందు కూర్చుని బిచ్చమెత్తుకునే యాదిరెడ్డి గతంలో కూడా అలా రోజూ వచ్చే డబ్బులన్నీ పోగేస్తూ.. మళ్లీ గుడులకే విరాళంగా ఇస్తూ వచ్చారు .
సాయిబాబా ఆలయానికి 8 లక్షల రూపాయలు విరాళం
మొదట్లో తాను లక్ష రూపాయలను గుడికి విరాళంగా ఇచ్చానని యాదిరెడ్డి చెప్పారు.ఇక తన ఆరోగ్యం దెబ్బ తింటుందని, అందుకే తానూ సేకరించిన డబ్బును ఆలయాలకు విరాళంగా ఇస్తున్నానని యాది రెడ్డి చెప్తున్నారు. తాను గుడికి డబ్బులివ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి అతనపై భక్తులకు అభిమానం పెరిగింది. అక్కడికి వచ్చే భక్తుల్లో తనకు గుర్తింపు వచ్చింది. తనకు వచ్చే డబ్బులు కూడా మరింతగా పెరిగాయని యాదిరెడ్డి వెల్లడించారు. ఇక తాజాగా సాయిబాబా ఆలయానికి 8 లక్షల రూపాయలు విరాళం ఇచ్చాడు .
ఆలోచింపజేస్తున్న యాచకుడు యాదిరెడ్డి ఆలయాలకు విరాళాలు ఇస్తున్న తీరు
ఒక్క సాయిబాబా గుడికే కాకుండా మరికొన్ని ఆలయాలకు కూడా తాను డబ్బులు విరాళంగా ఇచ్చానని చెప్పారు. తన జీవితమంతా దేవుడి సన్నిధిలోనే గడిపేస్తానంటూ యాదిరెడ్డి చెప్తున్నారు. ఎంత సంపాదించినా పక్క వాడి ప్రాణం పోతుంది అన్నా పైసా విదల్చని వాళ్ళు ఉన్న నేటి రోజుల్లో యాచకుడు యాదిరెడ్డి ఆలయాలకు విరాళాలు ఇస్తున్న తీరు అందరినీ ఆలోచింపజేస్తుంది. అతనే యాచకుడు , అయినప్పటికీ తాను యాచన చేసి సంపాదించిన వాటిని దైవ కార్యాలకు గుడులకు విరాళం ఇవ్వటం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం .