ఇండియన్ పోలీస్ సర్వీసా? జగన్ పోలీస్ సర్వీసా?: జగన్ కు పంచుమర్తి పంచ్
ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో నేతల మాటల తూటాలు పేలుతున్నాయి . ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మహిళానేత, అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. కరోనాను జాతీయవిపత్తుగా ప్రకటించినా, కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించినా జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు.
సీఎం జగన్ చేసిన కరోనాకి పారాసిటామల్ వ్యాఖ్యలు: స్పందించిన సాధినేని యామిని.. ఏమన్నారంటే
ఇక ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ఇంకా దేని మీదా లేదని అనూరాధ విమర్శించారు . కరోనా భయంతో జనం వణికిపోతుంటే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 నెలల్లో మలేరియాతో 24,500 మంది, డెంగీతో 4,300 మంది మృతి చెందారని పేర్కొన్న పంచుమర్తి అనూరాధ కరోనాతో ప్రపంచమే వణికిపోతుందని అన్నారు. ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎస్ఈసీ కులం గురించి మాట్లాడటమేంటి అని ఆమె ప్రశ్నించారు. పాలన అంటే వీడియో గేమ్ కాదని జగన్ రెడ్డి తెలుసుకోవాలి అని పంచుమర్తి విమర్శలు గుప్పించారు.
Recommended Video
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను నానా దుర్భాషలాడిన స్పీకర్ పదవికి తమ్మినేని సీతారామ్ అనర్హులు అని పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దౌర్జన్యాలను ప్రోత్సహించినందుకు పోలీసులను సీఎం పొగుడుతున్నారా? అని పంచుమర్తి అనూరాధ మండిపడ్డారు . కోర్టు ముందు డీజీపీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అని ఎద్దేవా చేశారు. పోలీసు వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకున్నారని, ఇక పోలీసులు అంటే ఇండియన్ పోలీస్ సర్వీసా? జగన్ పోలీస్ సర్వీసా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు .