ఎన్నికల టైమ్లో భూవివాదాలు, అధికారులతో గొడవలా?.. టీడీపీ ఎమ్మెల్యేపై బాబు ఆగ్రహం..!
విజయవాడ : కృష్ణా జిల్లాలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహారం వివాదస్పదమైంది. అధికారులతో పేచీ.. ఉచ్చులా తయారయింది. విజయవాడ సబ్ కలెక్టర్ తో జరిగిన వాగ్వాదం ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్వయంగా వచ్చి సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇదివరకే పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. అవినీతి అక్రమాల ఊసు లేకుండా జాగ్రత్తగా ఉండాలని పదేపదే చెబుతూ వస్తున్నారు. ఆ క్రమంలో బోడె ప్రసాద్ వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధినేత ఎంత చెప్పినా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుండటం పార్టీలో చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది.
వివాదం మొదలైంది ఇలా..!
పెనమలూరు మండలం వణుకూరులోని పుల్లేరు కట్టభూమి వివాదం.. బోడె ప్రసాద్ మెడకు చుట్టుకుంది. కోట్ల విలువచేసే ఆ ప్రాంతంలో కొందరు టీడీపీ నేతలు తవ్వకాలు చేపట్టారంటూ మీడియాలో కథనాలొచ్చాయి. దీనిపై స్పందించిన విజయవాడ సబ్ కలెక్టర్ మిషా సింగ్.. చర్యలు తీసుకోవాలంటూ పెనమలూరు ఎమ్మార్వోను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ సిబ్బంది తవ్వకాలు జరుగుతున్న చోటుకు చేరుకున్నారు. ప్రొక్లెయిన్ ను సీజ్ చేసి తరలిస్తుండగా.. అక్కడకొచ్చిన ఎమ్మెల్యే ప్రసాద్ వారిని అడ్డుకున్నారు. అంతేకాదు ఆ ప్రొక్లెయిన్ ను పోరంకిలోని తన గెస్ట్ హౌజ్ (ఆయన కార్యాలయం కూడా ఇక్కడే) కు తరలించారు.
ప్రొక్లెయిన్ ఇవ్వను.. అరెస్ట్ చేసుకోండి
ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. రెవెన్యూ అధికారులను అడ్డుకోవడమే గాకుండా ప్రొక్లెయిన్ తరలించిన తీరు ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ వణుకూరు వచ్చారు. ప్రొక్లెయిన్ ఎక్కడున్నా సరే సీజ్ చేయాలని, తవ్వకాలు చేపట్టినవారిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. అయితే వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్వయంగా ఆమె రంగంలోకి దిగారు. పోరంకిలోని ఎమ్మెల్యే గెస్ట్ హౌజ్ లో ప్రొక్లెయిన్ ఉందనే సమాచారంతో సబ్ కలెక్టర్ అక్కడకు వెళ్లారు. ఈక్రమంలో ప్రొక్లెయిన్ అప్పగించాలంటూ ఎమ్మెల్యేను అడిగారు. తనను అరెస్ట్ చేసినా సరే.. ప్రొక్లెయిన్ అప్పగించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈనేపథ్యంలో సబ్ కలెక్టర్, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రొక్లెయిన్ అప్పగించండి లేదంటే 2 లక్షల రూపాయల జరిమానా కట్టండంటూ ఆమె పట్టుబట్టారు. అయినా ఎమ్మెల్యే ప్రసాద్ వెనక్కి తగ్గలేదు. ఈక్రమంలో ఆయన అక్కడి నుంచి బయల్దేరి వణుకూరు వెళ్లిపోయారు. అదలావుంటే సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడే ఉన్న సబ్ కలెక్టర్ చివరకు వారిని అరెస్ట్ చేయాలంటూ మరోసారి ఆదేశాలు జారీచేస్తూ వెళ్లిపోయారు. వాస్తవానికి శుక్రవారం నుంచి మొదలైన రగడ ఆదివారం నాటికి కూడా సద్దుమణగలేదు. పుల్లేరు కట్ట భూమి తవ్వకాలకు సంబంధించి శుక్రవారం నాడే ఇద్దరు వ్యక్తులపై పెనమలూరు ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే వారు చర్యలు తీసుకోకపోవడంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చినట్లు సమాచారం. శనివారం రాత్రి సబ్ కలెక్టర్ మరోసారి ఆదేశాలు జారీచేసినా.. ఆదివారం నాటికి కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదట.
అధినేత ఆగ్రహం..! ఎన్నికల వేళ ఇలాంటి పనులా?
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహారం మీడియాలో వైరల్ గా మారడంతో పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఇలాంటి పనులు పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయని.. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. భూ వివాదాలు, అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండాలని చెబుతూ వస్తున్న చంద్రబాబు.. బోడె ప్రసాద్ వ్యవహారంపై ఏ నిర్ణయం తీసుకుంటారోననేది ఉత్కంఠగా మారింది. పాలనలో అందరి భాగస్వామ్యం అవసరమేనని, అధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలని చెప్పే చంద్రబాబు.. తాజా ఇష్యూతో పార్టీశ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో మరి.