అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో .. కేసీఆర్ నే అడగాలన్న మంత్రి పేర్ని నాని
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు రవాణాపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంతవరకు వీడలేదు. దీంతో రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బస్సు సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పాల్సింది తెలంగాణ సీఎం కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణాతో జల వివాదాలకు, బస్సులు నడపడానికి సంబంధం లేదని పేర్కొన్న పేర్ని నాని అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో తెలంగాణ సీఎం కేసీఆర్ నే అడగాలని వ్యాఖ్యానించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు రవాణా విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగాలని ఆదేశించారు. జగన్ సూచనతో ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని తెలంగాణ రవాణా మంత్రి అజయ్ కుమార్ తో చర్చలు కూడా సిద్ధమయ్యారు. కానీ అజయ్ కుమార్ చివరి నిమిషాల్లో అధికారుల స్థాయిలో సమస్యలు తొలగిపోతేనే మంత్రుల స్థాయిలో చర్చలు జరుపుదామని చర్చలను వాయిదా వేశారు.
Recommended Video
ఇప్పటివరకు అధికారుల స్థాయిలో పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ప్రతిష్టంభన వీడలేదు. బస్సులు ఎప్పుడు రోడ్ ఎక్కుతాయి అనేది తేలలేదు. ఇక ఈ విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ నే అని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు కరోనా వైరస్ బారిన పడిన వివరాలు తెలిపిన మంత్రి పేర్ని నాని ఆర్టీసీలో 4700 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కాకుండా ఒకరోజు కార్మికుల వేతనంతో పరిహారం ఇస్తామని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి ఆమోదం రాగానే ఆర్టీసీ కార్మికులను కూడా కోవిడ్ వారియర్స్ గా గుర్తిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.