రేపే విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం- వర్చువల్ పద్ధతిలో జగన్, గడ్కరీ ఓపెనింగ్...
ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహుర్తం కుదిరింది. రేపు వర్చువల్ పద్ధతిలో ఈ ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించబోతున్నారు. దీంతో పాటు మొత్తం 61 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంఖుస్ధాపనలు కూడా ఇదే ముహుర్తానికి జరగబోతున్నాయి.
కరోనా కారణంగా కేంద్ర రవాణామంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ నుంచి, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి గడ్కరీ నేరుగా రావాలని భావించినా సాధ్యం కాలేదు. దీంతో ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని వర్చువల్ మోడ్లోనే ప్రారంభించేందుకు గడ్కరీ, జగన్ అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ రాష్ట్రంలోనే అతి పెద్ద పైవంతెన కానుంది.
కనకదుర్గ ఫ్లైఓవర్తో పాటు ఏపీలో 61 కొత్త ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు, శంఖుస్ధాపనలు కూడా పూర్తి చేయాలని గడ్కరీ, జగన్ నిర్ణయించారు. రూ.15,592 కోట్ల ఖర్చుతో ఇవి రూపుదిద్దుకోనున్నాయి. ఈ కార్యక్రమం ఓసారి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి సంతాప దినాల కారణంగా, మరోసారి గడ్కరీకి కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి ఎలాగైనా ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్చువల్ పద్ధతివైపే మొగ్గుచూపాయి. దీనికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.