ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విద్యాశాఖలో పెను మార్పులు.. తెలుగు మీడియంకు స్వస్తి
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద విద్యార్థులకు సంవత్సరానికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్న జగన్ ఇక తాజాగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పు కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం పలు విమర్శలకు గురవుతోంది. ఇంతకీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే..
YS Jagan Mohan Reddy: మూడు జీవోలతో ముప్పేట దాడి: జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి..!
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదువులకు స్వస్తి
వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ తెలుగు మీడియం చదువులకు స్వస్తి పలికి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలని నిర్ణయించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలలలో వచ్చే ఏడాది నుండి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు తెలుగు మాధ్యమాన్ని రద్దుచేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్ మీడియం బెస్ట్ అని జగన్ నిర్ణయం
ఇక ఆపై ఈ ఏడాది 9, 10 తరగతులకు కూడా ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరగాలని నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మారుతున్న కాలానికి తగ్గట్టు, చదివిన చదువుకు ఉద్యోగావకాశాలు త్వరగా రావాలంటే విద్యార్థులకు ఇంగ్లిష్ పై మంచి పట్టు ఉండాలి అని భావించిన నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.విద్యా, వైద్య శాఖలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అన్ని పాఠ్యాంశాలను ఆంగ్లంలోనే బోధించాలని, తెలుగును ఒక సబ్జెక్టుగా మాత్రమే చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రైవేట్ స్కూల్స్ కు పోటీగా సీఎం జగన్ ఆలోచన ..తెలుగు,హిందీ..అత్యవసర పాఠ్యాంశాలు
ప్రైవేటు పాఠశాలలలో ఇప్పటికే తెలుగు కనుమరుగు కాగా, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తెలుగు మీడియం తీసేసి,ఇంగ్లీష్ మీడియంలో పాఠశాలలు నడిపించాలని భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ సైతం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తెలుగును,హిందీని అత్యవసర పాఠ్యాంశాలుగా ప్రతి పాఠశాలలోనూ బోధించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఉపాధ్యాయ నియామకాల్లోనూ ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత
ఇక అంతే కాకుండా తెలుగు మాధ్యమంలో చదువుకు ఇకనుండి స్వస్తి పలకనున్నామని, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన సాగనుందని ఉపాధ్యాయ నియామకాల్లోను ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉన్న వారినే నియమించాలని నిర్ణయించారని తెలుస్తోంది. విద్యార్థులు,ఉపాధ్యాయుల నిష్పత్తి అందరూ తప్పనిసరిగా పాటించాలని, ఇక ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధించిన ఉపాధ్యాయులకు వచ్చే విద్యా సంవత్సరానికి గాను ఈ ఏడాది వేసవి సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.
వచ్చే విద్యా సంవత్సరానికి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటుకు కసరత్తు
జిల్లా ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో ఆంగ్లభాష బోధన కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాదు విద్యాసంవత్సరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే పుస్తకాలను రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి తెలుగు మాధ్యమానికి గుడ్ బై చెప్పి ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. కొందరు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీసుకున్న నిర్ణయమని హర్షం వ్యక్తం చేస్తే, మరికొందరు ఇక తెలుగు చదువులు లేనట్టేనా అని పెదవి విరుస్తున్నారు.