రెండు రోజులు ప్రయత్నించినా టీడీపీ నేతలకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న మాజీ మంత్రి గంటా
ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం చంద్రబాబును జగన్ ఆహ్వానించినా ఆయన మాత్రం తన తరుఫున ప్రతినిధులను పంపారు . టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు , అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్లను పంపించారు . దీంతో వారు జగన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రయత్నించినా సీఎం అపాయింట్మెంట్ దొరకలేదని ప్రచారం సాగుతోంది. తాజాగా, దీనిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.
రెండు రోజుల పాటు ప్రయత్నించినా జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు. ఏపీ రెండో సీఎంగా బాధ్యతలను స్వీకరించిన జగన్ ను అభినందించేందుకు రెండు రోజుల పాటు ప్రయత్నించినా... కలిసే అవకాశం లభించలేదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. జగన్ ను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు తనతో పాటు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడును పార్టీ హైకమాండ్ పంపించిందని చెప్పిన ఆయన జగన్ తమకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని జగన్ తమకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు.
జగన్ హామీలను తుంగలో తొక్కేలా ఉన్నారు .. ప్రమాణ స్వీకారం సమయంలో జగన్ వ్యాఖ్యలు సరికావన్న గంటా
ఇదే సందర్భంలో జగన్ పై గంటా విమర్శలు గుప్పించారు. ప్రమాణస్వీకారం సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సమంజసంగా లేవని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన నవరత్నాల హామీ నుంచి తప్పించుకునేందుకు జగన్ యత్నిస్తున్నారని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత ప్రత్యేక హోదాపై జగన్ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారని... డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని గంటా వ్యాఖ్యానించారు . కేంద్రంలో బీజేపీకి అన్ని సీట్లు రాకుండా వుండాల్సింది అంటూ చేసిన వ్యాఖ్యల అర్ధం అదేనని ఆయన ఆన్నారు.
టీడీపీ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు .. గెలుపోటములు టీడీపీకి కొత్త కాదన్న గంటా శ్రీనివాసరావు
టెండర్లను రద్దు చేస్తామంటూ, గత ప్రభుత్వంపై కక్ష సాధింపులకు దిగేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. పెన్షన్ ను రూ. 3వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని... రూ. 250 మాత్రమే పెంచి, రూ. 2,250కి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. మద్య నిషేధంపై కూడా మాట తప్పారని దుయ్యబట్టారు. గెలుపు, ఓటమిలు టీడీపీకి కొత్త కాదని... తిరిగి ప్రజల మద్దతును పొందుతామని తెలిపారు.టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఏకాభిప్రాయంతోనే ఎన్నుకున్నామని గంటా పేర్కొన్నారు . టీడీపీ గతంలోనూ ప్రతిపక్ష పాత్ర పోషించిందన్నారు. ఎన్నికల్లో ఓటమిపై త్వరలో పార్టీలో అంతర్గతంగా విశ్లేషించుకొని, పొరపాట్లను గుర్తించి, తిరిగి ప్రజల మద్దతు పొందేందుకు చర్యలు తీసుకుంటామని గంటా స్పష్టం చేశారు.