జగన్ కు అచ్చిరాని "విచక్షణ"- వరుసగా మూడోసారి...
ఏపీలో రాజ్యాంగ సంస్ధలతో సై అంటే సై అంటున్న వైసీపీ సర్కారుకు ఇప్పుడో పదం విపరీతంగా చికాకు తెప్పిస్తోంది. అదే విచక్షణ. గతంలో ఏపీపీఎస్సీఛైర్మన్, మండలి ఛైర్మన్ విచక్షణాధికారాన్ని వాడి జగన్ కు చుక్కలు చూపిస్తే తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సైతం విచక్షణ అధికారంతో ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేసేశారు. దీంతో జగన్ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యాంగ సంస్ధలు-విచక్షణ
తమకున్న అధికారాలను నిబంధనల మేరకు వినియోగించుకోలేని పరిస్ధితుల్లో ఉన్నప్పుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు విచక్షణ అనే పదాన్ని వాడుతుంటారు. ఇదే కోవలో ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఏపీపీఎస్సీలో గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షల నేపథ్యంలో తొలిసారి విచక్షణ అనే పదం తెరపైకి వచ్చింది. అప్పట్లో గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్ష పేపర్ లీకేజీ అయిందని ఆరోపణలు వచ్చినా ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ తన విచక్షణ మేరకు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తేల్చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం అభాసుపాలైంది. ఆ తర్వాత ఆయన్ను తొలగించేందుకు ప్రయత్నించినా రాజ్యాంగ పదవి కాబట్టి అది సాధ్యంకాలేదు.
రెండోసారి మండలిలో విచక్షణ..
ఏపీ శాసనసభ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లులను శాసనమండలిలో ఎలా అడ్డుకోవాలో విపక్ష టీడీపీకి తట్టలేదు. దీంతో తొలుత రూల్ 71 ప్రకారం అసాధారణంగా చర్చను కోరిన టీడీపీ, అది కాస్తా వర్కవుట్ కాకపోవడంతో ఛైర్మన్ గా ఉన్న తమ పార్టీ ఎమ్మెల్సీ షరీఫ్ కు విచక్షణాధికారాన్ని వాడాల్సిందిగా సలహా ఇచ్చింది. దీంతో ఆయన కీలకమైన రెండు బిల్లులను ఆమోదించకుండా, అటు తిరస్కరించకుండా విచక్షణాధికారం మేరకు సెలక్ట్ కమిటీకి పంపాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండోసారి విచక్షణాధికారంతో జగన్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఎన్నికల వాయిదా రూపంలో హ్యాట్రిక్...
ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో స్ధానిక ఎన్నికల పోరును ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తన విచక్షణ అధికారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో విచక్షణ అనే పదం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం వ్యవహరించలేని సందర్భాల్లో ఈ విచక్షణ అనే పదాన్ని ఆయా సంస్ధల అధిపతులుగా ఉన్నవారు తెరపైకి తీసుకొస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ విధులు నిర్వర్తించేందుకు బిజినెస్ రూల్స్ ఉన్నప్పుడు ఈ విచక్షణాధికారం ఎందుకు వాడాల్సి వస్తోందన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.
Recommended Video
హ్యాట్రిక్ విచక్షణతో జగన్ అసహనం
విచక్షణాధికారం అనే పదాన్ని ఉపయోగించి రాష్ట్రంలో ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేయాలన్న ఎస్ఈసీ నిర్ణయంతో సీఎం జగన్ కూడా షాక్ అయ్యారు. దీంతో ఆయన తన మీడియా సమావేశంలో దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో విచక్షణాధికారం అనే కొత్తపదమొకటి వచ్చిందని, ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఏ పని చేయాలన్నా విచక్షణాధికారం అంటున్నారని జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఇలా ప్రతీ ఒక్కరూ విచక్షణ వాడుకుంటూ పోతే ఇక తామెందుకని కూడా ప్రశ్నించారు.