వల్లభనేని వంశీతో జాగ్రత్త అంటున్న జగన్ అభిమానులు .. పార్టీలోకి వద్దంటున్న వైసీపీ నేతలు
వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాడనే వార్తల నేపథ్యంలో జగన్ ఫ్యాన్స్ వల్లభనేని వంశీ రాకను తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ మోహన్ తాను ఎందుకు రాజీనామా చేస్తున్నా అన్న విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేధింపుల ఆరోపణలు చేస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. ఇక చంద్రబాబుకు రాసిన లేఖల్లో ఆయన పదే పదే ప్రస్తుత ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెడుతుందని, అనుచరులను సైతం వేధిస్తోందని పేర్కొన్నారు.
వంశీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్: జగన్ భయపెడితే బీజేపీ అండగా ఉంటుందంటూ: గంటా సైతం టచ్ లో ..!
వంశీ లేఖల నేపధ్యంలో పార్టీలో చేర్చుకోవటం అవసరమా అని చర్చ
వల్లభనేని వంశీ మోహన్ ఏదో బలవంతంగా రాజీనామా చేసినట్లుగా రాసిన లేఖ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో పెద్ద చర్చ జరుగుతోంది. అసలు వంశీని పార్టీలోకి తీసుకోవడం అవసరమా అన్న అభిప్రాయాన్ని చాలామంది నేతలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అంతే కాదు వల్లభనేని వంశీ మోహన్ వైఎస్సార్కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల వైసీపీ అభిమానవర్గాలే పెద్దగా ఆసక్తితో లేవు.ఇప్పుడు అతనిని ఎందుకు పార్టీ లోకి తీసుకోవాలి అనే ప్రశ్నలు వారి నుంచి ఉత్పన్నం అవుతున్నాయి.
ఎస్వీ రమణారెడ్డి హత్య ఘటన గుర్తుకు తెస్తున్న ఫ్యాన్స్ , వైసీపీ నాయకులు
ఇక ఇదే సమయంలో గతంలో జరిగిన అనేక విషయాలు తెర మీదకి తీసుకు వస్తున్నారు వైసిపి నేతలు మరియు జగన్ ఫాన్స్. గతంలో పెనుగొండ ఎమ్మెల్యే అయిన ఎస్ వి రమణారెడ్డి హత్య కేసును ప్రధానంగా తెరమీదకు తీసుకువచ్చారు. పరిటాల రవి వైరి వర్గంఅయిన ఎస్వీ రమణారెడ్డి హత్య వ్యవహారంలో వల్లభనేని వంశీ మోహన్ పాత్ర ఉందని గతంలోనే పలు వాదనలు వినిపించాయి. ఇక తాజాగా వంశీ వైసీపీలో చేరుతారన్న వార్తల నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా ఎస్ వి రమణ రెడ్డి హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు.
రమణారెడ్డి హత్యలో వల్లభనేని వంశీది కీలకపాత్ర అని ఆరోపణలు
రమణా రెడ్డిని భోజనానికి పిలిచి, నమ్మించి పరిటాల రవి వర్గానికి చెందిన ఆర్వోసీకి సమాచారం ఇచ్చి రమణారెడ్డిని హత్య చేయించడంలో వల్లభనేని వంశీ కీలక పాత్ర పోషించాడని సోషల్ మీడియాలో వైసీపీ అభిమాన వర్గాలు అంటున్నాయి.ఇక అలాంటి వ్యక్తిని పార్టీలో ఎందుకు చేర్చుకోవాలి అని గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి. వైయస్ జగన్ ని చాలామంది ఈ విషయంపై ప్రశ్నిస్తున్నట్లు గా, వల్లభనేని వంశీ వంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక యార్లగడ్డ వర్గం కూడా వంశీ రాకను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
పార్టీపై అభిమానంతో వంశీ రావట్లేదని లేఖలను ప్రస్తావిస్తున్న వైసీపీ నేతలు
అంతే కాకుండా తాజాగా వల్లభనేని వంశీ చేసిన రాజీనామాలో ప్రస్తుత ప్రభుత్వ వేధింపుల వల్లే, వైసీపీ నేతలు, ప్రభుత్వ అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బంది పెట్టడం వల్లనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైసిపి ప్రభుత్వం మీద వల్లభనేని వంశీ కి ఏ విధమైన అభిమానం లేదు. ఒకవేళ అలాంటి వ్యక్తి వైసిపి లో చేరితే అది కేవలం అవకాశవాద రాజకీయం తప్ప పార్టీ పైన అభిమానం కాదు అనే విషయాన్ని పదేపదే జగన్ దృష్టికి తీసుకు వెళుతున్న ట్లుగా సమాచారం.
వంశీతో జాగ్రత్త అంటూ జగన్ కు సూచనలు
ఏదేమైనప్పటికీ నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషించి,చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న వల్లభనేని వంశీ ఇప్పుడు పార్టీ ఫిరాయించి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకుంటే అందులో ఇంకా ఏదో మతలబు ఉంది అని వైసిపి నాయకులు అనుమానిస్తున్నారు. వంశీ తో జాగ్రత్త అని పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ వంశీ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో మరి .