మళ్ళీ మొదటికొచ్చిన బందరు పోర్ట్ వ్యవహారం .. నిర్మాణ ఒప్పందం రద్దు చేసిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బందరు పోర్టు నిర్మాణ ఒప్పందం రద్దుకు నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ లీజుకి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో బందరు పోర్టు నిర్మాణ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
వైసీపీలో పొన్నూరు పంచాయితీ .. వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలు గుస్సా
బందరు పోర్టు నిర్మాణ ఒప్పందం రద్దు చేసుకున్న జగన్ ప్రభుత్వం .. నవయుగ కంపెనీకి మరోసారి షాక్
ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బందరు పోర్టు నిర్మాణానికి మచిలీపట్నం పోర్టు లిమిటెడ్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అంతేకాదు భూ కేటాయింపుల్నీ రద్దు చేసింది.ప్రభుత్వ రంగ సంస్థలతో బందరు పోర్టును నిర్మించాలని యోచిస్తున్న ప్రభుత్వం 2010 నాటి నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే పోర్టు నిర్మాణం కోసం డెవలపర్కు ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని సైతం స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం బందరు పోర్టు నిర్మాణానికి లీడ్ ప్రమోటర్ గా నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ వ్యవహరిస్తోంది. మొన్నటికి మొన్న పోలవరం ప్రాజెక్టు పనుల టెండర్లు రద్దు చేసి నవయుగ కంపెనీ ని బయటకు పంపించిన జగన్ ఇప్పుడు బందరు పోర్టు నిర్మాణానికి నవయుగ కంపెనీ తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి నవయుగ కంపెనీకి మరోసారి షాక్ ఇచ్చారు. పోర్టు నిర్మాణానికి లీజు ప్రాతిపదికన ఇచ్చిన 412.57 ఎకరాల్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించి అసలు బందరు పోర్టు నిర్మాణం జరుగుతుందా లేదా అన్న సందిగ్ధ పరిస్థితిని నెలకొల్పారు.
చంద్రబాబు హయాంలో పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు.. పైలాన్ ఆవిష్కరణ
23 ఏప్రిల్ 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బందరు పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు ఒప్పందం జరిగినా ఇప్పటి వరకు టెండర్ల దశలోనే ఉంది. గత చంద్రబాబు ప్రభుత్వం బందరు పోర్టు నిర్మాణం చెయ్యాలని సంకల్పించింది. అందులో భాగంగా రూ.12 వేల కోట్ల వ్యయంతో బందరు పోర్టు నిర్మించాలని, 2025 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం గతంలో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న నిర్మాణ పనులను ప్రారంభించిన చంద్రబాబు , మేకవారిపాలెంలో పైలాన్ను సైతం ఆవిష్కరించారు . ఇప్పుడీ నిర్మాణ పనులను ప్రభుత్వం రద్దు చేయడంతో బందరు పోర్టు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.
పనుల్లో జాప్యం , ఒప్పంద ఉల్లంఘన కారణాలతో ఒప్పందం రద్దు .. నష్టపరిహారం కోరనున్న ప్రభుత్వం
అయితే ఒప్పందాన్ని ఉల్లంఘించిన కారణంగా, ఉద్దేశపూర్వకంగా పోర్ట్ నిర్మించకుండా జాప్యం చేయడం వంటి చర్యల కారణంగా ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్లు గా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ప్రభుత్వానికి నష్టం చేకూర్చేందుకు ఎం పి పి ఎల్ నుండి నష్టపరిహారం వసూలు చేసే హక్కు తమకు ఉందని జీవోలో పేర్కొంది. 2008 అక్టోబరులోనే బందరు పోర్టు నిర్మాణానికి 412.57 ఎకరాలు అప్పగిస్తే ఇప్పటివరకు అక్కడ పోర్టు నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టలేదని ప్రభుత్వం జీవోలో తెలిపింది. ఇక ఈ నేపథ్యంలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, 1872 ప్రకారం ఎంపీపీఎల్తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఆ స్థలాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇక పనులు జాప్యం చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించినందుకు నష్టపరిహారం కూడా కోరనున్నామని జీవోలో వెల్లడించింది.