విజయవాడ అగ్నిప్రమాదంపై జగన్ సీరియస్- రెండు విచారణ కమిటీలు-48 గంటల్లో నివేదిక..
విజయవాడలో కోవిడ్ 19 ఆస్పత్రిగా మార్చిన స్వర్ణా ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదం ఏపీలోని జగన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కోవిడ్ 19 విజృంభణ నేపథ్యంలో తీసుకున్న హడావిడి చర్యల ఫలితమే ఈ ప్రమాదమని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జగన్ సర్కారు దిద్గుబాటు చర్యలకు దిగింది.
Recommended Video
అసలు స్వర్ణాప్యాలెస్ హోటల్తో పాటు రమేష ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటళ్లలో రోగుల భద్రత పరిశీలనతో పాటు ఇంకా ఇలాంటి హోటల్స్ ఎన్ని ఉన్నాయి ? వాటిలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను సూచించేందుకు రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిని 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
విజయవాడ స్వర్ణా హోటల్ అగ్నిప్రమాదంలో పది మంది కరోనా రోగులు చనిపోయిన నేపథ్యంలో జగన్ సర్కార్ సంబంధిత అధికారులతో రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో ఒక కమిటీలో ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్యశాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రమేష్ ఆస్పత్రిలో కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స, ఆస్పత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న క్వారంటైన్ సెంటర్లలో రోగుల భద్రతపై విచారణ చేయబోతోంది. ప్రమాదంలో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని, స్వర్ణాప్యాలెస్ హోటల్ లో భద్రతా చర్యలతో తమకు సంబంధం లేదని రమేష్ ఆస్పత్రి వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.
అలాగే అగ్నిమాపకశాఖ డీజీ, ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్, ఛీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లతో మరో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ స్వర్ణప్యాలెస్తో పాటు ఇతర హోటళ్లలో నడుపుతున్న కోవిడ్ కేర్ సెంటర్లలో అగ్నిప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సూచించనుంది. ఈ కమిటీకి కూడా నివేదిక ఇచ్చేందుకు రెండు రోజుల సమయం ఇచ్చారు. ఈ రెండు నివేదికలు రాగానే భద్రతా ప్రమాణాలు పాటించని కోవిడ్ కేర్ సెంటర్లు, వాటిని నిర్వహిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.