ఏపీలో పింఛన్ల పెంపు వచ్చే ఏడాదే- జగన్ ప్రకటన- ఎమ్మెల్యే రామానాయుడుకు ప్రివిలేజ్ నోటీసు
ఏపీ అసెంబ్లీని ఇవాళ రాష్ట్రంలో పింఛన్ల పెంపు వ్యవహారం కుదిపేసింది. వైసీపీ ఎన్నికల హామీ మేరకు పింఛన్లు ఎప్పటి నుంచి పెంచుతారంటూ టీడీపీ వేసిన ప్రశ్నకు ప్రభుత్వం వద్ద నేరుగా సమాధానం లేకుండా పోయింది. ఏడాదికోసారి 250 రూపాయల చొప్పన పింఛన్లు పెంచుతూ నాలుగేళ్లలో 3000 రూపాయలకు పెంచుతామంటూ జగన్ గతంలో ఇచ్చిన హామీని టీడీపీ ప్రస్తావించింది.
పింఛన్ల పెంపు విషయంలో జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని టీడీపీ ఇవాళ ప్రస్తావించింది. టీడీపీ నేత రామానాయుడు జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పిన మేరకు పింఛన్లు ఇవ్వకుండా, పింఛన్లు పెంచకుండా మాట తప్పుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 45 ఏళ్లు దాటిన వారికి 3 వేల రూపాయలు ఇస్తామని చెప్పి, ఆ తర్వాత చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18000 ఇస్తామని మాట మార్చారని రామానాయుడు ఆరోపించారు. దీని వల్ల లబ్దిదారులకు ఒక్కొక్కరికి 17500 రూపాయల మేర నష్టం జరుగుతోందన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న జగన్ రామనాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
45 ఏళ్లు దాటిన మహిళలకు ఇచ్చే పింఛన్లను చేయూత పథకంగా మార్చడంపై తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ వీడియోను జగన్ మరోసారి అసెంబ్లీలో ప్రదర్శించారు. ఇందులో తానెక్కడా పింఛన్లు ఇస్తామని చెప్పలేదన్నారు. సభను తప్పుదోవ పట్టించిన రామానాయుడు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వొద్దని స్పీకర్ను కోరారు. అలాగే ఆయనకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు కూడా ఇవ్వాలని సూచించారు. దీంతో సభా నాయకుడి సూచన మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం రామనాయుడుకు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. అనంతరం పింఛన్లపై మరోసారి మాట్లాడిన జగన్ వచ్చే ఏడాది జూలై 8 నుంచి పింఛన్లను రూ.2500కు పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో ఈ చర్చ ముగిసింది.