రేపు ఇంద్రకీలాద్రికి జగన్- మూలానక్షత్ర్రం సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణ
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు బెజవాడ ఇంద్రకీలాద్రికి రానున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయాన్ని జగన్ దర్శించుకోనున్నారు. మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారికి జగన్ పట్టు పస్త్రాలు సమర్పించబోతున్నారు. జగన్ రాక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతీ ఏటా దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రులు బెజవాడ కనకదుర్గమ్మకు మూలా నక్షత్రం రోజున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ రేపు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్ బయలు దేరతారు. నాలుగు గంటల కల్లా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పండితుల ఆశీర్వచనాలు తీసుకుని తిరిగి వెళతారు.
Recommended Video
జగన్ ఇంద్రకీలాద్రికి రానున్న నేపథ్యంలో కరోనాతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవాదాయమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడి నుంచే ఫోన్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసు అధికారులు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. కనకదుర్గమ్మ గుడిలో తాజా ఘటనల నేపథ్యంలో సీఎం రాక సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రాక సమయంలో ఆంక్షలు కూడా అమలు చేయబోతున్నారు.