అది అమలయ్యేలోపు జగన్ జైల్లో ఉంటారు : టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిని రద్దు చేయాలనే జగన్ నిర్ణయం చెల్లబోదన్నారు. అంతేకాదు, మండలి రద్దు నిర్ణయం అమలు జరిగేలోపు ఆయన జైల్లో ఉంటారని హెచ్చరించారు. చేతిలో అధికారం ఉందని.. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యంలో కుదరదన్నారు. దేశంలో ఇలాంటి అధికార పక్షాన్ని మరెక్కడా చూడలేదన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టులో..
అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు చట్టాన్ని అతిక్రమించి చేసిన బిల్లు కాబట్టే మండలి వ్యతిరేకించిందన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని,అసెంబ్లీలో మెజారిటీ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టుగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టులో కేవలం 507 మంది విశాఖ వాసులు మాత్రమే అక్కడ రాజధానిని కోరుకున్నారని, కానీ దాదాపు 5వేల పైచిలుకు మంది రాష్ట్రప్రజలు రాజధానిని కృష్ణా-గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలని కోరుకున్నారని చెప్పారు. ఒకవేళ రాజధాని తరలింపుకు సంబంధించి చట్టం చేయాలంటే.. అది సెలెక్ట్ కమిటీ చేస్తుందన్నారు.
వైరల్ అయిన వీడియో..
మండలిలో రూల్.71పై చర్చకు అనుమతిచ్చాక.. టీడీపీ అధినేత చంద్రబాబు ఛాంబర్లో ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 'మనవాళ్ళు బాగా గొడవ చేశారు. బెజవాడ రౌడీయిజం చూపించారు. కొంచెం ఉంటే మంత్రులని కొట్టేవారు.' అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇది ఆయన నిజస్వరూపం అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
అశోక్ బాబు మంత్రులను ధైర్యంగా ఎదుర్కొన్నారని..
అదే సమయంలో టీడీపీ నేతలపై దాడి చేసేందుకు వచ్చిన మంత్రులు కొడాలి నాని,అనిల్ కుమార్లకు అశోక్ బాబు ఎదురు నిలిచారని.. చూసుకుందామంటూ కాలర్ ఎగిరేశారని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాదు,అశోక్ బాబు దెబ్బకు మంత్రులు ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారని.. టీడీపీ ఎమ్మెల్సీలకు ఆయన కవచంలా నిలిచారని ప్రచారం చేస్తున్నారు.
మండలి రద్దవుతుందా..?
సీఎం జగన్ గురువారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మండలి రద్దుకు సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలోనే అన్ని రకాల మేదావులు,విద్యావేత్తలు,వివిధ రంగాలకు చెందిన విజ్క్షులు ఉన్నప్పుడు.. మండలి అవసరం ఏముంది అని ఆయన ప్రశ్నించారు. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే మండళ్లు ఉన్నాయన్న జగన్.. రాష్ట్ర అభివృద్దికి అవి ఆటంకంగా ఉన్నాయన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు. దీంతో మండలి రద్దుకు కేబినెట్ ఏ క్షణానైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.