అమరావతిలో 85 శాతం ఒకే సామాజిక వర్గం : రాజధాని మారుస్తాం..ప్రధానికి సీఎం జగన్ లేఖ : ఉమా..!!
ఏపీ రాజధాని అమరావతి పైన బొత్సా వ్యాఖ్యలతో రచ్చ సాగుతుండగానే..టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధానిగా అమరావతిని తప్పిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్.. ప్రధానికి లేఖ రాసారని వెల్లడించారు. అదే సమయంలో అమరావతిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు 85 శాతం మంది ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నాంటూ దేవినేని ఉమా చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీని కలిసిన సమయంలో ఏ అంశాల మీద లేఖ ఇచ్చారో ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. అదే సమయంలో అమెరికా పర్యటనకు వెళ్లే ముందు తన పార్టీకి చెందిన కొందరికి రాజధాని ఎక్కడ రాబోతుందో చెప్పి.. అక్కడ స్థలాలు కొనుగోలు చేసుకోవాలని జగన్ సూచించారని ఉమా ఆరోపించారు. అమెరికా పర్యటనకు జగన్ వెళ్లింది వ్యక్తిగత పనుల కోసమేనని ఆరోపించారు.
ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ రాసారు..
ఏపీ రాజధాని అమరావతిని మార్చేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ కలిసిన సమయంలోనే ఈ మేరకు లేఖ ఇచ్చారని ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ లేఖలో అమరావతిలో అవినీతి జరిగిందని చెబుతూనే.. అక్కడ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు 85 శాతం ఉన్నారని చెప్పుకొచ్చారని దేవినేని ఉమా ఆరోపించారు. అమరావతిలో నిర్మాణాల ఖర్చు భారీగా ఉందని..ముంపు ప్రాంతమని చెబుతూ అమరావతి నుండి రాజధాని మార్చే కుట్ర అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధానికి చాలా రహస్యంగా ఈ లేఖ ఇచ్చారని.. పారదర్శక ప్రభుత్వంలో కాన్ఫిడెన్షియల్ లేఖలు ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ తాను కేంద్రానికి రాసిన లేఖ ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఏపీ రాజధాని అంశం పైన ప్రభుత్వంలో ఉన్న భయాన్ని తొలిగించేందుకు వెంటనే ట్వీట్ ద్వారా అయినా సంప్రదించాలని ఉమా సూచించారు.
అక్కడ భూములు కొనుగోలు చేయన్నారు..
రాజధాని మారుస్తామని మంత్రి బొత్స చెప్పిన తర్వాత మధ్యలో మాట్లాడేందుకు విజయసాయిరెడ్డి ఎవరని ఉమా ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై అసెంబ్లీలో చర్చ జరిగిందని గుర్తు చేసారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని వివరించారు. జగన్ తన అనుచరులకు ఫలానా ప్రాంతంలో భూములు కొనుక్కోమని చెప్పారన్నారని ఆరోపించారు. మీకు సీట్లు ఇవ్వలేకపోయా, అక్కడ భూములు కొనండి.. లాభం జరుగుతుందని చెప్పింది వాస్తవమా.. కాదా..చెప్పాలని నిలదీశారు. రాజధానిని మార్చేందుకు కేంద్రం అనుమతి లభించిందా అని ప్రశ్నించారు. జగన్ అమెరికా పర్యటనలోనూ సొంత ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. అదే విధంగా ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ప్రముఖ విద్యా సంస్థలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఏపీలోని 13 జిల్లాలకు మధ్యలో రాజధాని ఏర్పాటు చేసామని..దీనిని ఇప్పుడు తరలించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ చెబితేనే మంత్రి బొత్సా ఆ ప్రకటన చేసారని ఉమా చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చి..రైతుల్లో ఉన్న ఆందోళన తొలిగించాలని డిమాండ్ చేసారు.
ఉమా వ్యాఖ్యలతో కలకలం..
ఇప్పుడు టీడీపీ నేత దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ సాగుతోంది. ప్రధానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసారాని..రాజధాని మారుస్తున్నారంటూ చెప్పిన విషయాలు కేవలం రాజకీయంగా విమర్శల కోసమేనా..అందులో నిజం ఉందా అనే విషయం పైన చర్చ మొదలైంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని తరలింపు సాధ్యం కాదని.. కొంత ప్రాంతం కుదించే అవకాశం ఉందని టీడీపీ నేతలే అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన నుండి వచ్చిన తరువాత దీని పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, ముఖ్యమంత్రి చెప్పకుండా మంత్రి బొత్సా అంత కీలక వ్యాఖ్యలు చేయరనే అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది.