Jana Sena: పొత్తా? విలీనమా?..షరతులేంటీ: తేలేది నేడే: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ: కాస్సేపట్లో..!
విజయవాడ: రాష్ట్ర రాజకీయ యవనికపై మరి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతోన్నాయి. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ రాజకీయ భవితవ్యం ఏమిటో తేల్చి పారేసే పరిణామాలు అవి. జాతీయ పార్టీ.. భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకోవడమా? లేక.. విలనీం చేయడమా? అనే అంశం మీద మరి కాస్సేపట్లో కీలక సమావేశం ఏర్పాటు కాబోతోంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జనసేన, బీజేపీ నేతలు ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు.
రాష్ట్ర రాజకీయాలకు పుట్టినిల్లుగా భావించే విజయవాడలో ఈ భేటీ ఏర్పాటైంది. విజయవాడ లబ్బీపేట సిద్ధార్థనగర్లోని రెవెన్యూ కాలనీలో ఉన్న ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్.. దీనికి వేదికగా మారింది.
ఢిల్లీ పర్యటన ప్రభావమే..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఢిల్లీ పర్యటన ముగించుకున్న తరువాతే ఈ సమావేశాన్ని నిర్వహిస్తుండటం ఆసక్తి రేపింది. దేశ రాజధానిలో పవన్ కల్యాణ్.. రెండు రోజుల పాటు మకాం వేసి మరీ బీజేపీ పెద్ద తలకాయలను కలుసుకున్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కొందరు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, కేంద్రమంత్రి వీ మురళీధరన్, సహ ఇన్ఛార్జి సునీల్ దేవ్ధర్లతోనూ భేటీ అయ్యారు.
ఢిల్లీ పర్యటన వివరాలు..
తొలుత- తన ఢిల్లీ పర్యటన వివరాలను పవన్ కల్యాణ్.. ఈ సమావేశం సందర్భంగా బీజేపీ నేతలకు అధికారికంగా వివరించే అవకాశం ఉంది. జేపీ నడ్డాతో నిర్వహించిన భేటీ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలన్నింటినీ ఆయన బీజేపీ రాష్ట్రశాఖ పెద్దల ముందు ఉంచుతారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనంతరం నెలకొన్న పరిణామాలపై చర్చిస్తారు.
మూడు రాజధానుల ప్రకటనపై ఉమ్మడి పోరాటాలకు పిలుపు
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జనసేనతో పాటు బీజేపీ కూడా పట్టుబట్లుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు ఈ అంశంపై రాజకీయ తీర్మానాన్ని చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అవసరం లేదని, అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రెండు పార్టీలు ఒకే లైన్లో ఉన్నందున.. ఉమ్మడి పోరాటాలకు పిలుపునిచ్చే అంశంపైనా చర్చించడం ఖాయంగా కనిపిస్తోంది.
పొత్తా? విలీనమా?: ఈ రెండు అంశాల మీదే..
బీజేపీ, జనసేన పార్టీ నేతల మధ్య పొత్తు కుదుర్చుకోవడానికేననేది బయటికి తెలుస్తోన్న సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు పార్టీలు కలిసి పోరాడాలని, దీనికోసం ఒక అవగాహన కుదుర్చుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ- జనసేన నేతల మధ్య తొలి దఫా భేటీని ఏర్పాటు చేశారని అంటున్నారు. అక్కడే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విలీనంపై చర్చించే ఛాన్స్..
పొత్తు కోసమే అయితే ఇంత భారీ ఎత్తున, కీలక నేతలను కలుసుకోవడం, వారితో భేటీ కావాల్సిన అవసరం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పొత్తుతో పాటు విలీన ప్రతిపాదనను కూడా తెర మీదికి తీసుకుని రావడానికి అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి- విలీన అంశాన్నే ప్రధానంగా తీసుకుని ఈ రెండు పార్టీల నేతల మధ్య చర్చించవచ్చనీ అంటున్నారు.
దిశానిర్దేశం చేసేదెవరు?
ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రెండు పార్టీల నుంచి పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పంతం నానాజీ, డాక్టర్ పంచకర్ల సందీప్, ముత్తా శశిధర్ సహా పలువురు నాయకులు పాల్గొననున్నారు. బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జి సునీల్ దేవ్ధర్, అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.