pawan kalyan on jagan: సూట్కేసులు, కోర్టు కేసులు.. జగన్ సంక్షేమాన్ని మరిచారని విమర్శ
Recommended Video
జగన్ సర్కార్పై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదు నెలల పాలనలో సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులు 50 మంది చనిపోయినా ఊలుకు పలుకు లేదని మండిపడ్డారు. కత్తులు, గొడ్డలితో కాక తప్పుడు పాలసీ విధానాలతో కూడా జనాన్ని చంపొచ్చని జగన్ నిరూపించారని ధ్వజమెత్తారు. శుక్రవారం గుంటూరులో డొక్కా సీతమ్మ ఆహార శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
పవన్ కల్యాణ్ డెంగ్యూ, చికెన్ గున్యా దోమలాంటివాడు... విజయసాయిరెడ్డి సెటైర్లు
ప్రజల గొంతుక
ప్రజల సమస్యను వినిపించేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజల గళమై, వారి బాధను వినిపించడమే తన బాధ్యత అని పేర్కొన్నారు. కానీ కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. డొక్కా సీతమ్మ పేరుతో భోజనం పెడుతున్నామని చెప్పారు. ప్రజలకు అండగా ఉన్నామని.. అందుకే సీతమ్మ పేరుతో ఆహార శిబిరం ఏర్పాటు చేశామని పవన్ కల్యాణ్ వివరించారు.
ఇతర ప్రాంతాల్లోనే
డొక్కా సీతమ్మ ఆహార శిబిరాల ఎంపిక ప్రక్రియ నిష్పాక్షిపాతంగా చేపట్టినట్టు పవన్ తెలిపారు. జనసేన నేతలు, జన సైనికులు, అభిమానులు, నేతలు లేని చోట శిబిరాలను ఏర్పాటుచేశామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మస్థైర్యాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తుంటే.. వారికి ఉన్నామని భరోసా కల్పించేందుకు డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ఏర్పాటుచేశామని పవన్ వివరించారు.
కార్తీక దీక్ష
డొక్కా సీతమ్మ ఆహార శిబిరంలో తనను ఓ కార్మికుడు అన్నం తినాలని కోరాడని పవన్ తెలిపారు. కానీ తాను కార్తీక మాస దీక్షలో ఉన్నానని.. అందుకే తినలేదని చెప్పారు. మనస్పూర్తిగా తినాలని ఉన్నా, దీక్ష వల్ల తప్పలేదని పవన్ పేర్కొన్నారు.
ఆకలి అంటే తెలుసా..?
వైసీపీ ఎమ్మెల్యేలకు ఆకలి బాధ తెలియదని పవన్ విమర్శించారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆకలి బాధ తెలుసా అని పవన్ ప్రశ్నించారు. ఒకవేళ వారికి ఆకలి అంటే ఏంటో తెలిస్తే ఇంతమంది చనిపోతే చూస్తూ ఊరుకోరని పేర్కొన్నారు.
ప్రజల పక్షపాతి
జగన్ను జగన్ రెడ్డి అంటే ఫీలవుతారు.. కానీ తనను పవన్ నాయుడు అని మీ సహచర మంత్రులు నిందిస్తారు అని పవన్ గుర్తుచేశారు. 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న అధికార పార్టీ విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతుంది అని మండిపడ్డారు. తాను ప్రజల కోసం పాటుపడతానని.. వారి కోసం శత్రుత్వం పెట్టుకుంటానని పేర్కొన్నారు.
5 నెలలా..?
ఇసుక వారోత్సవాలు చేయడానికి ఐదునెలల సమయం కావాలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులు చనిపోతే తప్ప వారోత్సవాలు నిర్వహించేందుకు ముందుకురారా అని నిలదీశారు. ప్రభుత్వ పెద్దలు ఎన్నడైనా పస్తులు ఉన్నారా అని పవన్ అడిగారు. అర్ధాకలి అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.
పులివెందులకు మార్చండి.. కానీ
టీడీపీ హయాంలో నిర్మించిన రాజధాని అమరావతి నచ్చకుంటే కుదించాలని పవన్ కోరారు. పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. పులివెందులలో రాజధాని నిర్మించాలనుకొన్న త్వరగా నిర్ణయించి, నిర్మించాలని పవన్ కోరారు. తనపై విధానాలపరంగా విమర్శిస్తే ఓకే కానీ.. వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. సూట్కేసులు, కోర్టు కేసుల మధ్య సాగే మీ నుండి విధానపర విమర్శలు ఆశించడం కల్లే అని పవన్ స్పష్టంచేశారు.