జయరాం మర్డర్ మిస్టరీ: హత్యపై హంతకుడు పూసగుచ్చినట్లు వివరించాడు..శిఖా చౌదరి పాత్రేంటి..?
హైదరాబాదు/ అమరావతి: కోస్టల్ బ్యాంకు యజమాని చిగురుపాటి జయరాం హత్యకేసులో దాదాపు మిస్టరీ వీడింది. జయరాంను హత్య చేసింది తనే అని రాకేష్ రెడ్డి పోలీసుల వద్ద వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్లయింది. మరి పోలీసుల విచారణ సందర్భంగా రాకేష్ వెల్లడించిన అంశాలు ఏమిటి...? హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది... జయరాం హత్య కేసులో శిఖా పాత్ర గురించి రాకేష్ రెడ్డి ఎలాంటి అంశాలు పోలీసుల వద్ద వెల్లడించాడు..?
జయరాంను హత్యచేసింది నేనే: రాకేష్ రెడ్డి
ఎక్స్ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డి నేరం అంగీకరించారు. టెట్రాన్ పాలీలెన్స్ ఉద్యోగుల జీతాల కోసం తన దగ్గర రూ.4.5 కోట్లు అప్పు జయరాం తీసుకున్నారని రాకేష్ తెలిపాడు. జనవరి 29ను అమెరికా నుంచి జయరాం తిరిగి రాగేనే జూబ్లీహిల్స్లోని తన ఇంటికి తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు రాకేష్ రెడ్డి. ఇక అప్పుతీసుకున్న డబ్బు ఇవ్వాల్సిందిగా అడగడంతో వారిద్దరి మధ్య గొడవ చోటు చేసుకున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో కోపంతో జయరాంను కొట్టినట్లు అంగీకరించాడు రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డిని గట్టిగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడని విచారణలో చెప్పాడు. జయరాం హార్ట్ పేషంట్ కావడంతో ఆయన వెంటనే చనిపోయినట్లు తెలిపాడు.
జయరాం హత్య తర్వాత సాయంత్రం వరకు ఇంట్లోనే మృతదేహం
జయరాం చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ఏమి చేయాలో తెలియని పరిస్తితుల్లో ఆ మృతదేహాన్ని తన ఇంట్లోనే సాయంత్రం వరకు ఉంచుకున్నట్లు చెప్పాడు రాకేష్ రెడ్డి. ఉదయం 9గంటల ప్రాంతంలో హత్య జరిగినట్లు ఆయన చెప్పారు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మృతదేహాన్ని మరొకరి సహాయంతో కారులోకి ఎక్కించినట్లు చెప్పిన రాకేష్ రెడ్డి ఆ తర్వాత తనే కారును నడిపినట్లు చెప్పాడు. మృతదేహం కారులో ఎక్కించేందుకు సహాయపడ్డ వ్యక్తిని కూడా కారులోకి ఎక్కించుకోలేదని కేవలం డెడ్ బాడీ తను మాత్రమే కారులో ఉన్నట్లు రాకేష్ రెడ్డి వెల్లడించాడు. విజయవాడకు వెళుతుండగా దారి మధ్యలో మద్యం సేవించినట్లు రాకేష్ రెడ్డి పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. అనంతరం నందిగామ సమీపంలోని ఐతవరం దగ్గర కారును వదిలేసినట్లు చెప్పాడు. స్టీరింగ్పై వేలిముద్రలు కనిపించకుండా జాగ్రత్త పడ్డట్లు రాకేష్ రెడ్డి వెల్లడించాడు. ఆ తర్వాత ఏమి చేయాలో తెలియక... హైవేపై హైదరాబాదుకు వచ్చే బస్సులో తాను ఎక్కి నగరానికి చేరుకున్నట్లు వెల్లడించాడు.
కుక్క ఇంజెక్షన్తో జయరాం హత్య!: నాతో లైంగిక సంబంధం.. విల్లాకు వచ్చేవాడు: శిఖా చౌదరి
డబ్బులు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు
అంతకుముందు జయరామ్తో తన ఇంట్లో చర్చలు జరిగిన సమయంలో తనకు డబ్బు తిరిగి చెల్లించేందుకు తన ముందే పలు విధాల ప్రయత్నాలు చేశాడని రాకేష్ రెడ్డి చెప్పాడు. తన ముందే జయరాం తన మిత్రులకు ఫోన్ చేసి రూ.4.5 కోట్లు సర్దుబాటు చేయాలని చెప్పినట్లు వెల్లడించాడు. అయితే జయరాం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డబ్బులు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని చెప్పాడు. చివరి ప్రయత్నంగా కోస్టల్ బ్యాంకు మాజీ మేనేజర్ ఈశ్వర్ ప్రసాదుకు ఫోను చేసి డబ్బులు సర్దాల్సిందిగా కోరితే తన దగ్గర అంత డబ్బు లేదని రూ.6 లక్షలు మాత్రం సర్దుబాటు చేయగలనని చెప్పినట్లు రాకేష్ వివరించాడు. ఇక ఆ డబ్బులు తీసుకునేందుకు రాకేష్ రెడ్డి తన మనిషిని ఈశ్వర్ ప్రసాదు దగ్గరకు పంపాడు. ఫోనులో ఈశ్వర్ ప్రసాద్, రాకేష్ రెడ్డి మనిషి సంభాషిస్తున్న విజువల్స్ సీసీ కెమరాకు చిక్కాయి. ఈశ్వర్ ప్రసాదు ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్లు జయరాంకు ఫోన్లో చెప్పినట్లు రాకేష్ రెడ్డి పోలీసులకు చెప్పాడు.
శిఖా చౌదరితో తన సంబంధం గురించి జయరాం ఏమి చెప్పాడంటే..?
ఇక కేసులో పోలీసులు అనుమానిస్తున్న శిఖా చౌదరిపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రాకేష్ రెడ్డి. శిఖా చౌదరి తన రెండో భర్తకు విడాకులు ఇచ్చిందని... తనను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పిందని రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పాడు. ఈ క్రమంలోనే రాకేష్ రెడ్డి ఆమెపై భారీగా ఖర్చు పెట్టినట్లు చెప్పాడు. శిఖా చౌదరికి ఖరీదైన నగలు తీసివ్వడంతో పాటు డబ్బులు కూడా చాలా ఇచ్చానని రాకేష్ రెడ్డి తెలిపాడు. అయితే శిఖాతో జయరాం చనువుగా ఉండటాన్ని తాను సహించలేకపోయినట్లు చెప్పాడు రాకేష్ రెడ్డి. వారిద్దరి మధ్య కూడా పలుమార్లు ఇదే విషయమై గొడవ జరిగినట్లు రాకేష్ రెడ్డి చెప్పాడు. ఇదిలా ఉంటే శిఖా తీసుకున్న డబ్బులు కూడా తానే చెల్లిస్తానని చెప్పాడు జయరాం. ఇద్దరూ కలిసి తనను ఆర్థికంగా దెబ్బతీస్తారా అని ఆగ్రహం చెందిన రాకేష్ రెడ్డి మద్యం మత్తులో జయరాంను కొట్టినట్లు తెలిపాడు. జయరాంను చంపాలన్న ఉద్దేశం తనకు లేదని వెల్లడించిన రాకేష్ రెడ్డి... హార్ట్ పేషంట్ అవడంతోనే జయరాం ఒక్క దెబ్బకే మృతి చెందినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు.
మొత్తానికి జయరాంను హత్య చేసినట్లు రాకేష్ రెడ్డి ఒప్పుకోవడంతో జయరాం హత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్లైంది. అయితే పోలీసులు మరింత లోతైన విచారణ చేస్తామని వెల్లడించారు.