ఆ "కోటి"కి పార్టీ కండువా వేసి..ఇంతలా బీజేపీ నేతలు: సోషల్ మీడియాలో జగన్ అభిమానుల రచ్చ...!
జాతీయ స్థాయిలో బీజేపీ తిరుగులేని పార్టీ. ఏపీలో 2024లో మాదే అధికారం. మరి..అంతగా ధీమాగా ఉన్న బీజేపీ నేతలు పార్టీలోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎవరు వచ్చినా సరే..పార్టీలోకి వలసలు అని చూపించుకొనేందుకు ఇంతలా జారి పోవాలా అనే చర్చ మొదలైంది. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఒక యువకుడికి పార్టీ కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఎవరినీ తీసుకున్నా అభ్యంతరం ఉండేది కాదు. కానీ, మహిళలను వేధించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించటం..అందునా రాష్ట్ర అధ్యక్షు డి హోదాలో స్వయంగా కన్నా ఆహ్వానించటం పైన సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
కోటీకి బీజేపీలోకి ఆహ్వానం...కండువా కప్పిన కన్నా..
విలువలు..నిబద్దత..నిజాయితీ..ఎన్నో భారీ డైలాగులు చెప్పే బీజేపీ నేతలు ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని స్థితిలో కి వెళ్లిపోయారు. ఎవరు ప్రభావితం చేసారో ఏమో కానీ.. ఆ కోటిని బీజేపీలో స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆహ్వానించటం పైన సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. ఎందుకంటే అతని మీద వచ్చిన అభియోగాలు ప్రతీ ఒక్కరిలో ఏహ్య భావం కలిగించాయి. అటువంటి కోటిని స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వయంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇప్పుడు ఇదే విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీలను తమ పార్టీలో విలీనం చేసిన సమయంలోనూ ఇంతలా బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్స్..పోస్టింగ్స్ కనిపించలేదు. ఇప్పుడు మాత్రం బీజేపీ.. రాష్ట్ర శాఖను..రాష్ట్ర అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ జగన్ అభిమానులే కాదు.. సాధారణ పౌరులు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఎవరీ కోటీ...ఎందుకీ ఆగ్రహం..
ఎన్టీఆర్ సతీమణి..ప్రస్తుతం వైసీపీలో ఉన్న లక్ష్మీ పార్వతి వ్యక్తిగత సహాయకుడిగా పని చేసి కోటేశ్వరరావే ఈ కోటి. ఎన్నికల ముందు ఒక పార్టీ నేతల ప్రలోభాలకు లొంగి లక్ష్మీ పార్వతి ఫోన్ నుండి తన ఫోన్కు అసభ్య మెసేజ్లు పంపి తనకు లక్ష్మీ పార్వతి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ ససమయంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ తరువాత పోలీసుల విచారణలో ఈ వ్యవహారంలో లక్ష్మీ పార్వతి ప్రమేయం లేదని..కోటీ కొందరి ఒత్తిడితోనే ఆ విధంగా వ్యవహరించారని తేలింది. దీంతో..అప్పుడే కోటి పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియా వేదికగా కోటిని ఒక ఆట ఆడుకున్నారు. అటువంటి కోటి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటువంటి వ్యక్తి కేవలం కేసులు లేకుండా ఉండేందుకే బీజేపీ లోకి వచ్చారని.. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిన వ్యక్తా..అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు మొదలయ్యాయి. మరి..ఈ చేరిక గురించి బీజేపీ రాష్ట్ర నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
జాతీయ నేతల దృష్టికి వ్యవహరం..
జాతీయ నేతల సమక్షంలో ఏపీ బీజేపీ వ్యవహారాల పైన రెండు రోజుల పాటు కోర్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే టీడీపీ..జనసేన నుండి అని చర్చ సాగింది. అయితే కోటి లాంటి వారిని చేర్చుకోవటం ద్వారా బీజేపీ పైన వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని బీజేపీ నేతలకు తెలియని విషయం కాదు. ఇటువంటి వారిని ప్రోత్సహించటం సరైనది కాదని తెలుసు. అయినా..ఎక్కడ ఏం జరిగిందో ఏమో కానీ, నేరుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే ఇప్పుడ కోటీని ఆహ్వానించటం..దీని పైన పార్టీలో చర్చ..సోషల్ మీడియాలో రచ్చ పైనా బీజేపీ కేంద్ర నాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందనే అంశం పైప రాష్ట్ర నేతలు ఎదురు చూస్తున్నారు.