కన్నా, సాయిరెడ్డి రాజకీయ క్రీడలో బాబు ఎంపైర్.. కాణిపాకం వినాయకుడు థర్డ్ ఎంపైర్..
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం రంకెలేస్తోంది. అధికార వైసీపి పార్టీ నేతల విమర్శనాస్త్రాలు చంద్రబాబు నాయుడు టూ కన్నా లక్ష్మీనారాయణ వయా సుజనా చౌదరి మీదుగా అనేక మలుపులు తీసుకుంటూ సుధీర్గ ప్రయాణం చేస్తున్నాయి. మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఢీకొట్టి వేగంగా ముందుకు వెళ్లాలని వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపిలో బీజేపి పార్టీకి సంబందించిన ఆర్థిక లావాదేవీల్లో అవినీతి చోటు చేసుకుందని, అందులో స్వయంగా ఏపి బీజేపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రమేయం ఉందని వైయస్సార్ సీపి ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తున్నారు.
ఊహించని మలుపులు తీరుగుతున్న కన్నా, సాయిరెడ్డి ఎపిసోడ్.. కాణిపాకంలో ప్రమాణానికి రెడీ అంటున్న కన్నా..
ఇదిలా ఉండగా కరోనా క్లిష్ట సమయంలో ఇలాంటి చౌకబారు ఆరోపణలు ఎందుకని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తుండగా, లాక్ డౌన్ తర్వాత అవినీతికి పాల్పడలేదని కాణిపాకం వరసిద్ది వినాయకుడు సాక్షిగా ప్రమాణం చేస్తానని, అదే వినాయకుడి సన్నిధిలో ప్రమాణం చేసే ధైర్యం ఉందా అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఎంపీ విజయసాయి రెడ్డికి సవాల్ విసురుతున్నారు. లాక్ డౌన్ ఆంక్షల తర్వాత కాణిపాకం వచ్చేందుకు సిద్దంగా ఉండాలంటూ విజయ సాయి రెడ్డికి సూచిస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ. దీంతో ఏపి రాజకీయం ఒక్క సారిగా వెడెక్కింది. అంతే కాకుండా ఏపి భారతీయ జనతా పార్టీ నిధుల అంశంలో గుబులు పుట్టించే అంశాలను వెలుగులోకి తెచ్చారు వైసీపి ఎంపి విజయసాయి రెడ్డి.
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల రగడ.. వైసిపి అవినీతిని ఎత్తి చూపినందుకే కన్నా పై విమర్శలంటున్న బీజేపి..
దాదాపు 20కోట్ల రూపాయలకు ఏపి బీజేపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమ్ముడు పోయారన్నది సాయి రెడ్డి ప్రధాన ఆరోపణ. అయితే ఎన్నికల సందర్బంగా పార్టీ విడుదల చేసే నిధులు, పంపకాలు, నేతల ప్రమేయం అన్నీ ఏ పార్టీకి ఆపార్టీ అంతర్గత వ్యవమారంలా ఉంటుంది. ఈ అంశాన్ని రాజకీయం చేయడంగాని, రాజకీయంగా లబ్ది పొందాలనుకోవడానికి గాని పెద్దగా స్కోప్ ఉండదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీకి నిధుల అంశం సర్వసాదారణమైన సబ్జెక్టు కాబట్టి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత ఉండదు. కాని ప్రస్తుతం ఇదే అంశానికి వైసీపి ఎంపి విజయ సాయి రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది.
రాజకీయాలకు ఇది సమయం కాదన్న చంద్రబాబు, పవన్.. టీడిపి, జనసేనపై వైసీపి ఘాటు విమర్శలు..
అసలు ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ రాపిడ్ టెస్టుల కోసం ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కిట్లు, వాటికి ఖరారు చేసిన ధరల అంశాన్ని బీజేపి ఏపి అద్యక్షుడి హోదాలో కన్నా లక్ష్మీ నారాయణ తప్పుబట్టారు. కన్నా కు కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపి ఇంత రాద్దాంతం చేస్తోందని, కిట్ల కొనుగోళ్లలో జరిగిన అవకతవకల గురించి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపి ప్రభుత్వం కొత్త వివాదాన్ని బుజాన వేసుకుందనే చర్చ కూడా జరుగుతోంది. కరోనా మహమ్మారి చాపక్రింద నీరులా విస్తరిస్తున్న తరుణంలో రాజకీయాలెందుకు అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు నాయుడును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా వైసిపి నేతలు ఘాటుగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Recommended Video
తగ్గేది లేదన్న కన్నా... ప్రమాణం చేసే దమ్ముందా అంటూ సాయిరెడ్డికి సవాల్..
తాజాగా తాను చంద్రబాబుకు అమ్ముడుపోయినట్లుగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాను అమ్ముడుపోయేంత దిగజారుడు రాజకీయ నేతను కాదంటూనే తాను కాణిపాకం దేవాలయంలో ప్రమాణానికి సిద్దమని, తనతోపాటు ప్రమాణం చేసేందుకు విజయసాయిరెడ్డి కూడా సిద్దం కావాలని కన్నా లక్ష్మీనారాయణ ఛాలెంజ్ విసిరారు. తాజాగా కన్నా చేసిన కామెంట్లపై విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఐతే చంద్రబాబు నాయుడు ఏం చెబితే బీజేపి నేతలు అదే చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. విపత్కర సమయంలో రాజకీయాలేంటని ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా వైసీపి విరుచుకు పడుతోంది. మొత్తానికి లాక్ డౌన్ తర్వాత ఎవరు ఎంత అవినీతి పరులో కాణిపాకం వినాయకుడే నిర్ణయిస్తాడని కన్నా స్పష్టం చేస్తున్నారు.