ఆ నేతలు ఇక చంద్రబాబుకు దూరమేనా: సమావేశానికి కాపు నేతల దూరం: వారి వెనుక ఉన్నదెవరు...!
టీడీపీలో ఏం జరుగుతోంది. కాపు నేతలు టీడీపీకి దూరమవుతున్నారా. కాపుల నుండి టీడీపీని దూరం చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా. టీడీపీ అధినేత విదేశీ పర్యటన ముగించికొని వచ్చిన తరువాత అనేక అంశాల మీద కీలకంగా సమావేశం ఏర్పాటు చేసారు. ప్రజావేదిక కూల్చివేతతో పాటుగా..కాపు నేతల సమావేశం..అదే విధంగా రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరటం పైన చర్చించటం కోసం సమావేశం ఏర్పాటు చేసారు. అయితే, ఈ సమవేశానికి కీలక నేత లు హాజరు కాలేదు. అదే సమయంలో చంద్రబాబు రాజ్యసభ ఎంపీల విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇంతకీ ఈ కాపు నేతల వెనుక ఉన్నదెవరు..వారి వ్యూహాలు ఏంటి..
చంద్రబాబుకు కాపు నేతలు జలక్...
టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీలోని కాపు నేతలు జలక్ ఇచ్చారు. చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయం లో కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమైన కాపు మాజీ ఎమ్మెల్యేలు..కేవలం ఎన్నికల ఫలితాల సమీక్ష కోసమే తామంతా భేటీ అయ్యామని..తాము పార్టీ మారే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. తాము అధినేత చంద్రబాబు విదేశాల నుండి తిరిగి రాగానే కలుస్తామని స్పష్టం చేసారు. అదే సమావేశంలో తమను తక్కువ చేసి..సొంత సామాజిక వర్గం నుండి ఎన్నికల బరిలో ఉన్నవారికి ఎన్నికల నిధులు..ప్రాధాన్యత ఇవ్వటంలో చంద్రబాబు..లోకేశ్ వివక్ష చూపించారంటూ కాపు నేతలు మండి పడ్డారు. అయితే, ఇప్పుడు స్వయంగా చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాలేదు. తమకు సమాచారం లేదని కొందరు కాపు నేతలు చెబుతుంటే..సమాచారం ఇచ్చినా కొందరు రాలేదని తెలుస్తోంది. దీంతో..కాకినాడ సమావేశానికి హాజరైన నేతల అజెండా తెలుసుకొనే ప్రయత్నాలు చంద్రబాబు ప్రారంభించారు. కాపు నేతల సమావేశానికి హాజరైన బడేటి బుజ్జి..వేదవ్యాస్ అధినేతకు తమ మీటింగ్ సారాంశం చెప్పినట్లు తెలుస్తోంది.
బోండా ఉమా ఎందుకు దూరం..
విజయవాడలో టీడీపీ ముఖ్య నేతలుగా ఉన్న ఎంపీ కేశినేని నాని..బోండా ఉమా కొద్ది రోజులుగా అధినాయకత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీ నాని తన అసంతృప్తిని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్నారు. ఇక, వైసీపీ మీద సందర్భం వచ్చిన ప్రతీ సారి విరుచుకుపడే బోండా ఉమా విజయవాడలోనే అందుబాటులో ఉన్న చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాలేదు. అదే విధంగా కాపు వర్గంలో కీలక నేతలుగా ఉన్న గోదావరి జిల్లాలో పాటుగా మరి కొందరు ముఖ్యులు దూరంగా ఉన్నారు. సీనియర్ నేతగా ఉన్న తోట త్రిమూర్తులు మాత్రం పూర్తిగా అసమ్మతి గళం వినిపిస్తున్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రజా వేదిక కూల్చివేతను సమర్ధించిన ఆయన వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. అదే విధంగా తాము సమావేశం ఏర్పాటు చేసుకుంటే జరిగే నష్టం ఏంటని..తాము సమావేశం అవ్వటం కొత్త కాదని చెప్పుకొస్తున్నారు. మరి కొంత మంది కాపు నేతలు ఇదే తరహా లో టీడీపీ వ్యతిరేక స్వరం వినిపించేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
కాపు నేతల వెనుక ఉన్నదెవరు..
కాపు నేతలు ఇలా దూరం పాటించటం వెనుక వారి ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు చర్చ సాగుతోంది. తమ అసంతృప్తిని అధినేత గుర్తించటం కోసమా..లేక, ఇక టీడీపీలో భవిష్యత్ లేదనే ఉద్దేశంతో పార్టీ మారుతున్నారా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, కాపు నేతలంతా ఒకే ఆలోచనలో లేరని..కొందరు నేతలు వైసీపీతో టచ్ లో ఉంటే..మరి కొందరు బీజేపీ వైపు ఆసక్తి చూపుతున్నారంటూ ఢిల్లీ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ తాజాగా బీజేపీలో చేరిన ఓ ముఖ్యుడు వీరికి మార్గదర్శకం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన సూచన మేరకే వీరంతా తొందర పడకుండా..వ్యూహాత్మకంగా ముందుగా లోకేశ్ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక, రానున్న రోజుల్లో కాపు నేతల యాక్షన్ ప్లాన్ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకపోవటంతో వీరంతా ఎటు వెళ్లినా..వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. కానీ, అదే జరిగితే టీడీపీకి మాత్రం భారీ నష్టమే.