అమరావతిలో కాపు నేతల భేటీ..! ఏం డిసైడ్ చేస్తారు..? కొత్తేం కాదంటున్న టీడిపి..!!
విజయవాడ/హైదరాబాద్ : బెజవాడలో ఏపీ టీడీపీ కాపు నేతల మీటింగ్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఇంట్లో నేతలు భేటీ అయ్యారు. కాకినాడ సమావేశం తర్వాత కాపు నేతలు ఈ రోజు రెండో సారి భేటీ అయ్యారు. ఇక కాపు నేతలు రేపు సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..పార్టీ మార్పు అంశం మా భేటీలో జరగలేదని చెప్పారు. పోటీ చేసిన కాపు అభ్యర్థులకు పార్టీ నుంచి సరైన సహకారం అందలేదని ఆరోపించారు. పార్టీలో కొందరు వ్యక్తుల వల్ల వచ్చిన ఇబ్బందులను అధినేత దృష్టికి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఈ భేటీలో చర్చించామని అన్నారు. బీజేపీ లోకి వెళ్ళటానికి ఇన్ని మీటింగ్స్ అక్కర్లేదని, నేరుగా కండువా కప్పుకుంటే సరిపోద్దని అన్నారు.మా ఆలోచన పార్టీ మార్పు గురించి కాదని స్పష్టం చేశారు. అధినేత ఇచ్చిన హామీ బట్టే మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, చంద్రబాబుకి చెప్పే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, తోటా త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రు, మాధవ నాయుడు, బడేటి బుజ్జి, చెంగల రాయుడు, పంచకర్ల రమేష్ బాబు పలువురు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా టీడీపీకి అధికారం మరియు ప్రతిపక్షం రెండు కొత్త కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని టీడిపి రాష్ట్ర కార్యాలయంలో పెదనందిపాడు నుంచి వచ్చిన కార్యకర్తలు ఆయన్ను కలిసిన సందర్భంగా మాట్లాడారు. 37 ఏళ్లుగా పార్టీ జెండాను మోశారన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తెదేపాను బలపరిచే సైన్యాన్ని తయారు చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు పోలీసులు భద్రత కల్పించాల్సిన అవసరముందని చెప్పారు. టీడిపి కి నష్టం చేయాలని చూస్తే వారికే నష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీడిపి కి 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని.. వారిని కాపాడుకునే బాధ్యత పార్టీదేనని చెప్పారు. దాడుల్లో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను త్వరలో చంద్రబాబు పార్టీ తరఫున 5లక్షల రూపాయల సాయం అందజేయన్నారని చెప్పారు.