ప్రజా స్వామ్యమా ... రాక్షస రాజ్యమా ? టీడీపీ నేతల మీద దాడి ఘటనపై కేఈ కృష్ణమూర్తి ఫైర్
నేడు మాచర్లలో టీడీపీ నేతల వాహనాలపై జరిగిన దాడి నేపధ్యంలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఒక్క టీడీపీ మాత్రమే కాదు ప్రతిపక్షాల నేతలు ఈ దాడులను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. నేడు మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేతలు బోండా ఉమా , బుద్దా వెంకన్నల కారుపై కొందరు దాడులు చేయడంతో , పెద్ద పెద్ద కర్రలతో కార్ల అద్దాలు పగలగొట్టటంతో మాజీ మంత్రి , మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సీరియస్ అయ్యారు. ఇది ప్రజా స్వామ్యమా లేకా రాక్షస రాజ్యమా అని ఆయన ప్రశ్నించారు.
ప్రాణాలతో వస్తామో లేదో ..!! చంద్రబాబుకు తమపై జరిగిన దాడిని చెప్పిన బొండా ఉమా , బుద్దా వెంకన్న
వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న మాజీ మంత్రి
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తోన్న కారుపై కొందరు పెద్ద, పెద్ద కర్రలతో దాడులు చేసి కారు అద్దాలు ధ్వంసం చెయ్యటం వారిపై దాడికి పాల్పడటం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నపై వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కేఈ కృష్ణమూర్తి . ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో టీడీపీ నేతలను నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు .
Recommended Video
రాష్ట్రంలో ఫ్యాక్షన్ సంస్కృతి పెరిగిపోతుందన్న కేఈ కృష్ణమూర్తి
మాచర్లలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతల నుండి నామినేషన్ పత్రాలు దౌర్జన్యంగా లాక్కుని చించేశారని చెప్పిన కేఈ కృష్ణమూర్తి ఆ ఘటనపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి సంబంధించి వెళ్లిన నేతలపై దాడి చేస్తారా.? రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేస్తారా.? అని ఇదేనా ప్రజా స్వామ్యం అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ సంస్కృతి, రాజ్యమేలుతుందని పేర్కొన్నారు. కక్షా రాజకీయాలు ఎంతలా పేట్రేగిపోతున్నాయో చెప్పడానికి ప్రస్తుత ఘటనే సాక్ష్యం అని ఆయన అన్నారు .
పోలీసుల మీద కూడా దాడి చెయ్యటం జగన్ ప్రోద్బలంతోనేనా ?
మాజీ మంత్రిపైన, ఎమ్మెల్సీపైన వైసీపీ యువజన నేతలు బరితెగించి దాడికి పాల్పడ్డారంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం అరాచకమే రాజ్యమేల్తుందని చెప్పటానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు . అసలు ప్రజలకు జగన్ ప్రభుత్వంలో రక్షణ ఉందా అని ప్రశ్నించిన మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారంటే ఏ ధైర్యంతో పాల్పడ్డారని అన్నారు. వారి వెనుక ముఖ్యమంత్రి జగన్ లేరని చెప్పగలరా.? అని నిలదీశారు.
జగన్ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా ఉందని అసహనం
అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని చెప్పిన ఆయన జగన్ పాలన మొదట నుండీ దాడులతోనే సాగుతుందని చెప్పారు . ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించే వారిని ఎన్నుకోవడంలో కీలకంగా వ్యవహరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ తరహా దాడులను సహించబోమని తేల్చి చెప్పారు.