కేశినేని ట్రావెల్స్ పై కోర్టుకెక్కిన సిబ్బంది.. కేశినేని కొత్త కష్టాలకు కారణం ఇదేనా ?
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానీకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఏపీలో ఎన్నికల తర్వాత నుండీ సొంత పార్టీ నేతలను, ప్రత్యర్థి పార్టీ నేతలను సోషల్ మీడియా వేదికగా తిట్టి పోస్తున్న కేశినేని నానిపై కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఊహించని విధంగా కేశినేని నానీపై వేతనాల కోసం ఆ సంస్థ సిబ్బంది ధర్నాకు దిగారు. లెనిన్ సెంటర్ వరకు ప్రదర్శనగా వెళ్లిన కార్మికులు అక్కడ నిరసనకు దిగారు. తమకు బకాయిపడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాలం అడగని వారు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టటం , కోర్టు మెట్లెక్కటం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అని కేశినేని సన్నిహితులు ఆలోచనలో పడ్డారు.
ఏపీలో జగన్ దళం.. ఆయన కోసం దేనికైనా సిద్ధం .. వైసీపీ ఎమ్మెల్యే సంచలనం
కేశినేని ట్రావెల్స్ ..కేశినేని నాని కుటుంబానికి చెందిన కేశినేని ట్రావెల్స్కు దాదాపు 90 ఏళ్ల చరిత్ర ఉంది. కేశినేని నానీ జీతాలు చెల్లించకుండా కేశినేని ట్రావెల్స్ మూసివేశారని పలువురు కార్మికులు లేబర్ కోర్టును ఆశ్రయించారు. గతంలో టీడీపీ హయాంలో భారీగా ప్రైవేటు బస్సులను నడుపుతూ ఆర్టీసి ఖజానాకు నాని గండికొడుతున్నారంటూ విపక్షాలు చాలా సార్లు ఆందోళన చేశాయి. అంతే కాకుండా రవాణా శాఖా కమీషనర్ సుబ్రహ్మణ్యంతో నానీకి పెద్ద ఘర్షణే జరిగింది. ఈ నేపధ్యంలో రాజకీయ నాయకుడిగా ఉంటూ, ట్రావెల్స్ వ్యాపారం చేయడం కష్టంగా ఉందని అందుకే ట్రావెల్స్ మూసివేస్తున్నట్టు ప్రకటించారు నానీ .
కేశినేని ట్రావెల్స్ మూసివేతతో వందల మంది మళ్లీ ఉపాధి పోయింది. చాలా మంది నిరుద్యోగులయ్యారు. అయితే అప్పుడు ఆందోళన చేసిన ఉద్యోగులు ఇంత కాలం సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మరోమారు నానీ తమ జీతాలు చెల్లించలేదని ఆందోళన బాట పట్టారు . తమ జీతాలు చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్తున్నారు. అయితే ఇటీవల కేశినేని నానీ సోషల్ మీడియా వేదికగా నడిపిస్తున్న వార్ కు ఇప్పుడు కొత్తగా కేశినేనికి వచ్చిన ఈ సమస్యకు ఏదైనా సంబంధం ఉందా అన్నది రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతుంది.