తెలుగు తమ్ముళ్ళ ఆధిపత్యపోరు .. కేశినేని వర్సెస్ బుద్దా వెంకన్న .. రంగంలోకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క ఎన్నికల సమయంలో అధికారపక్షంతో తలపడుతూ తీవ్ర పోరాటం చేస్తున్న టిడిపిలో తెలుగు తమ్ముళ్ల మధ్య కొనసాగుతున్న రగడ టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహానికి కారణమైంది. బెజవాడ సిటీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గాలమధ్య కార్పొరేటర్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు, తలెత్తిన వివాదాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
కుప్పంలో ఓటమిపై బాబు కలవరం , పార్టీ శ్రేణులకు క్లాస్.. త్వరలో కుప్పం వెళ్లనున్న చంద్రబాబు

39 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీ నేతల మధ్య రగడ
39 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎంపిక విషయంలో వీరి మధ్య వివాదం చోటు చేసుకోవడమే కాకుండా బహిరంగ వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ఈ పరిణామాలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. నేతల పరస్పర విమర్శలతో పార్టీకి తీవ్ర నష్టం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి సహించేది లేదని హెచ్చరించారు. ఇక 39 వ డివిజన్ అభ్యర్థి అంశాన్ని రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చూసుకుంటారని పేర్కొన్నారు .

టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం
విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి విషయంలో కేశినేని నానీకి , బుద్దా వెంకన్నకు మధ్య విబేధాలు పొడసూపాయి. మేయర్ అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు . కేశినేని నాని కూతురు శ్వేత పార్టీ నాయకత్వం మేయర్ అభ్యర్ధిగా ఖరారు చేసిందని ప్రచారం జరుగుతుంటే, ప్రత్యర్థి వర్గమైన బుద్ధ వెంకన్న వర్గం ఆ ప్రచారాన్నిఖండిస్తూ వచ్చింది. దీంతో కొన్ని రోజులుగా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారైంది .

బహిరంగ విమర్శలు చేసుకోవటం సహించేది లేదని అధినేత వార్నింగ్
దీంతో చంద్రబాబు బహిరంగ విమర్శలు చేసుకోవడం , వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం చేస్తే సహించేది లేదని నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
తాజా పరిణామాలతో టీడీపీ నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు కాస్త ఇప్పుడు బహిర్గతమై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గతంలో దేవినేని ఉమా , వల్లభనేని వంశీల మధ్య రగడ వల్లభనేని పార్టీ వీడి వెళ్ళటానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు .

బుద్దా వర్గానికి చెందిన అభ్యర్థికి కాకుండా కేశినేని నానీ వర్గానికి టికెట్
39 డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గుండారపు పూజిత ను కాదని వైసీపీ నుంచి టిడిపి లోకి వచ్చిన వ్యక్తికి ఎంపీ కేశినేని నాని టికెట్ ఇవ్వడం, డివిజన్లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడానికి రావడం వెంకన్న వర్గీయులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఎంపీ నానీని గుండారపు పూజిత తదితరులు అడ్డగించారు. కేశినేని నాని తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వెళ్లిపోయారు.

పార్టీ నేతల మధ్య సమన్వయానికి రంగంలోకి దిగనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఎన్నికల సమయంలో పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని భావిస్తున్న అధినేత చంద్రబాబు పార్టీ నేతలను సమన్వయపరిచి ఏకతాటి మీదకు తీసుకురావడానికి నేరుగా రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ కేశినేని నానికి, బుద్ధ వెంకన్న , నాగుల్ మీరా, బోండా ఉమ తదితరులకు మధ్య దూరం పెరుగుతోందని గుర్తించిన చంద్రబాబు అందరిని సమన్వయ పరచడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్లుగా సమాచారం.

తనకు చంద్రబాబు వార్నింగ్ ఇవ్వలేదని చెప్తున్న కేశినేని నానీ
అయితే పార్టీ నాయకులకు చంద్రబాబు పార్టీ గురించి తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ఎవరు మాట్లాడవద్దని చెప్పినట్లుగా చెప్తున్నారు. కేశినేని నాని తనకు చంద్రబాబునాయుడు ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదని, తనపై తప్పుడు వార్తలను ప్రచురించవద్దని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం బెజవాడ టీడీపీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.