బందర్ పోర్టు ఒప్పందం రద్దు నిర్ణయాన్ని సమర్దిస్తాను .. కానీ అంటూ మెలిక పెట్టిన కేశినేని నానీ
ఏపీ సీఎం జగన్ ను కేశినేని నానీ ట్విట్టర్ వేదికగా పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలపైన ఆయన చాలా మర్యాదగా జగన్ గారూ అని సంబోధిస్తూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక వీలైన చోట చురకలు వేస్తూనే ఉన్నారు. పిచ్చోడి చేతిలో రాయి మీ చేతిలో పాలన అంతే అని జగన్ ను ఉద్దేశించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన నానీ ఇప్పుడు అన్నదాతలు నేరస్థులు కాదని వారిని రక్షించాలని జగన్ ను కోరుతూ పోస్ట్ చేశారు. ఇక బెజవాడ సమస్యల మీద దృష్టి పెట్టమని చెప్తూనే పీవీపీ , నిమ్మగడ్డ ప్రసాద్ ల విషయంలో జగన్ కు చురకలు వేసిన కేశినేని నానీ తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తనదైన శైలిలో స్పందించారు .
టెండర్లను రద్దు చేస్తూ పోతే నష్టం తప్ప లాభం లేదని జగన్ పై ఫైర్ అయిన కన్నా
ఏపీ సర్కార్ బందరు పోర్టు నిర్మాణానికి మచిలీపట్నం పోర్టు లిమిటెడ్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అంతేకాదు భూ కేటాయింపుల్నీ రద్దు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలతో బందరు పోర్టును నిర్మించాలని యోచిస్తున్న ప్రభుత్వం 2010 నాటి నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే పోర్టు నిర్మాణం కోసం డెవలపర్కు ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని సైతం స్వాధీనం చేసుకుంది. ఇక తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని విజయవాడ లోక్ సభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఇక ఇదే విషయమై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "సీఎం గారు... మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను సమర్ధిస్తాను. కానీ ఈ పోర్టును తెలంగాణాకో, వాన్ పిక్ కో లేక ఇతర ప్రైవేట్ వారికో ధారాదత్తం చేయకుండా ప్రభుత్వమే చేపట్టే నిర్ణయం తీసుకుని మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి" అని అన్నారు. అంటే పోర్టు నిర్మాణ ఒప్పందాల రద్దు దేని కోసం , మరో అవినీతి కోసం కాదు కదా అని అంటూనే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.
బందరు పోర్టు పనులను సకాలంలో చేపట్టలేదన్న కారణంతో గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ కు ఇచ్చిన కాంట్రాక్టు ఒప్పందాన్ని జగన్ సర్కారు రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది . ఇక ఆ సంస్థకు లీజుకిచ్చిన భూమిని వెనక్కు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వానికి నష్టం కలిగించినందుకు పరిహారం కోరే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం న్యాయ నిపుణులను కోరింది. అయితే ఇప్పటికే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు వస్తుంటే ఇక తాజాగా బందర్ పోర్టు వ్యవహారంలో కూడా పలు విమర్శలు వస్తున్నాయి.