మళ్ళీ లొల్లి షురూ... కేశినేని వర్సెస్ పీవీపీ... సోషల్ మీడియా సాక్షిగా తిట్ల దండకం
విజయవాడ ఎంపీ కేశినేని నాని, పీవీపీల మధ్య ట్విట్టర్ వార్ మరోమారు మొదలైంది. ఇక నానీ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ కు పీవీపీ ట్విట్టర్ వేదికగా తిట్ల పురాణం మొదలెట్టారు . మరోసారి ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటి నుంచి విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీపీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఒక దశలో వీరి ఘర్షణ ఎక్కడి దాకా వెళ్తుందో అన్న అనుమానం సైతం కలిగింది. మధ్యలో శాంతించినా మరోమారు అగ్గి రాజుకుంది.
నేటి నుండి ఏపీలో నూతన ఇసుక విధానం .. ఇక నిర్మాణ రంగ కార్మికుల సమస్య తీరినట్టేనా!!
కేశినేని నానీ, పీవీపీ తమ ట్వీట్లతో సోషల్ మీడియాను వేడెక్కించారు. ఆ తర్వాత వీరి మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపుకునేలా చేసింది. పరస్పరం ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకునేంత వరకూ వెళ్లింది. అంతే కాదు , ఎవరైనా ఓ ట్వీట్ చేశారంటే ఆ వెంటనే మరొకరు దానికి కౌంటర్ ఇస్తున్నారు. మొన్నటిదాకా ఒక పెను తుఫానులా సాగిన వీరి మాటల యుద్ధం ఈ మధ్య కాస్త శాంతించింది. ఇక తాజాగా మరోమారు దేశ ఆర్థిక వ్యవస్థ వీరి మధ్య చిచ్చు పెట్టేసింది. దేశ ఆర్థిక వ్యవస్థతో వీళ్ళకు ఏమి సంబంధం అంటే ఆర్థిక మందగమనంపై ఓ ట్వీట్ చేశారు ఎంపీ కేశినేని నాని "దేశంలో ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేయడానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని, అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే.. ఈ సమయంలో ఏపీ ఆర్థిక అద్భుతాలు సృష్టించేదని.. కానీ, ఇప్పుడా అవకాశం కోల్పోయాము" అని ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్లో 'ressision' రాసుకొచ్చారు.
అయితే దీనిపై చాలా వ్యంగ్యంగా , సీరియస్ గా రియాక్ట్ అయిన పీవీపీ 'RESSISION' స్పెల్లింగ్ను కూడా రాయటం రాలేదని విమర్శించారు. పీవీపీ కేశినేని ని ఉతికి ఆరేశారు. మిస్టర్ ఎంపీ 'RECESSION' స్పెల్లింగ్ కూడా రాని వాడివి మా కర్మ కాకపోతే, నీకెందుకయ్యా, ఎకానమీ గురించి స్టేట్మెంట్స్ అంటూ చాలా దారుణంగా కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా.. కొన్ని గంటల తర్వాత మరింత ఘాటుగా మరో ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్ లో కేశినేనిని ఘోరంగా తిట్టిపోశారు. "చదువు సంధ్య లేని బజారు మనుషులు కూడా మాట్లాడడం మన తెలుగు ప్రజల కర్మ. ఇష్యూ డైవర్ట్ చెయ్యకు, కావాలంటే ఇంగ్లీష్, తెలుగు ట్యూషన్ మాస్టర్స్ పంపిస్తాను. పిచ్చి వాగుడు కట్టిపెట్టి, వొళ్ళు వంచి పనిచేయరా బడుద్దాయ్! లేదంటే , నీ ఇంటికొస్తా, నీ ఆఫీసుకొస్తా, ఎక్కడున్నా వచ్చి నీ పళ్ళు రాలగొడతా! '' అంటూ పీవీపీ ట్వీట్ చేశారు. ఇక పీవీపీ వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని నాని కూడా సోషల్ మీడియా వేదికగా రెచ్చ్చిపోయారు "ఆర్థిక నేరస్థులు కూడా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగానని భావించటం అంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి పట్టిన కర్మే." అని ట్వీట్ చేశారు. ఇలా మరోమారు ఇద్దరు నేతల మధ్య చిచ్చు రగిలింది. ఇది ఈ సారి ఎక్కడికి దారి తీస్తుందో మరి.