గెలిపించడం ఎంత తెలుసో.. ఓడించడం కూడా అంతే తెలుసు..! గబ్బర్ సింగ్ ఘాటు రియాక్షన్..!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో అన్ని రాజకీయ పార్టీలగురించి కాకుండా జనసేన పార్టీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఒక్కచోట అయినా గెలిస్తే బావుండేది. ఇది జనసేన అభిమానుల అంతరంగం కాదు. విపక్ష వైసీపీ, వ్యతిరేక వర్గాల నుంచి పెల్లుబుకిన అభిప్రాయం. మానవత్వంతో స్పందించే అటువంటి నాయకుడు అవసరం ఉందంటూ ప్రత్యర్థులు కూడా అంగీకరించారు. ఇంతటి నమ్మకం పెంచు కున్న జనసేనాని ఓటమికి స్వయంకృతాపరాధం కారణమైతే.. మరో కీలకమైన అంశం తెలుగుదేశంతో చీకటి ఒప్పందం ఉందనే ఆరోపణలను ప్రజలు నమ్మటం. మూడేళ్ల క్రితం పవన్ పార్టీ ఆవిర్భావ సభలో తొలిసారి చంద్రబాబు, లోకేష్ బాబు అవినీతిపై విరుచుకుపడ్డాడు. బాబుతో యుద్ధానికి తెర తీసారు.
మొదట్టో జనసేనకు యమ క్రేజ్..! మద్యలో మిడిల్ డ్రాప్ ఐన ఫాన్స్..!!
అవినీతిపై తాను ప్రశ్నిస్తానంటూ మంచి ఊపుతెచ్చారు. కానీ అంతలోనే ఏమైందో.. తన మాటల దాడిని జగన్ వైపునకు మళ్లించారు. అధికార ప్రభుత్వంపై సంధించాల్సిన విమర్శలు, ఆరోపణలు విపక్షంపై విసరటంపై వైసీపీ కూడా గట్టిగానే తిప్పికొట్టింది. అప్పటికే టీడీపీ పాలనలో జన్మభూమి, అగ్రిగోల్డ్, రాజధాని భూముల వ్యవహారంలో విసిగిన ఓటర్లు పవన్ ఎవరి వైపు అండగా ఉంటారనేది అర్థం చేసుకోలేకపోయారు. ఒంటరిగా బరిలోకి దిగే సాహసం చేసేటపుడు బలాన్ని చూసుకోవాలి. ఇతర పార్టీలతో చెలిమి చేయాలనుకుంటే బలమైన పార్టీతో చెలిమి చేయాలి.
రెక్కల కష్టాన్ని నమ్ముకున్న పవన్..! కనికరించని కాపు ఓటర్లు..!!
కానీ.. ఇవేమీలేకుండానే కేవలం తన చరిష్మాతో గెలుస్తామనే ధీమాతో పవన్ ముందుకు కదిలారు. ప్రతిచోట వైసీపీ అధినేత జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపించారు. టీడీపీ కూడా దీన్ని తమకు అనువుగా మలచుకుంది. పవన్ తమవాడేనని.. కేవలం వైసీపీ ఓట్లను చీల్చేందుకు తామే బరిలో నిలిపామంటూ ప్రచారం చేసుకున్నారు. అప్పటికే టీడీపీ పాలనతో విసిగిన ఓటర్లు పవన్పై ఆశలు పెట్టుకుని ఉన్నారు. కానీ.. టీడీపీ ప్రచారంతో పవన్కు ఓటేసినా అది టీడీపీకే లాభం చేకూర్చుతుందనే ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా కాపు ఓటర్లు.. టీడీపీలోని కమ్మ నేతల చేతిలో ఇబ్బందులు పడ్డారు.
వైరం వెనక స్నేహం..! కొంప ముంచిన టీడిపి..!!
కాపు బీసీ రిజర్వేషన్పై ఉద్యమం చేపట్టి ముద్రగడ పద్మనాభం పట్ల టీడీపీ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించింది. ఇవన్నీ కళ్లెదుట తిరిగ్గానే కాపులకు భవిష్యత్పై బెంగ పట్టుకుంది. పవన్ను గెలిపించినా టీడీపీతో కలిసి నడుస్తాడనే అభిప్రాయానికి వచ్చారు. జగన్ మోహన్రెడ్డిని గెలిపించటం ద్వారా చిరకాల శత్రువు టీడీపీపై ప్రతీకారం తీర్చుకోవచ్చనే ఆలోచనకు వచ్చారు. పవన్కు చంద్రబాబు బంటుగానే భావించి జగన్ వైపు ఆకర్షితులయ్యారు. పైగా వైసీపీ కూడా కాపులకు కీలకమైన నియోజకవర్గాలు కేటాయించటం కూడా మరింత కలిసివచ్చింది.
తానోడి.. ఓడించిన పవన్..! రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు మరికొంత సమయం తప్పదు..!!
ఇవన్నీ పవన్ ను ఓటుబ్యాంకు ఉన్నా ఒంటరిని చేసి ఓడేందుకు కారణమయ్యాయి.. టీడీపీపై ప్రజావ్యతిరేక ఓట్లు జగన్ కు మళ్లాయి. టీడీపీ ఓట్లను భారీగా చీల్చిన పవన్.. టీడిపి అభ్యర్థులను దెబ్బతీశారు. చంద్రబాబుకు స్నేహితుడు అనే విషయాన్ని కాపులు నమ్మటం ద్వారా తాను ఓడాడు. తాను ఓడి.. ఒక ప్రత్యర్థిని ఓడించిన ఘనత పవన్కే దక్కుతుందంటూ జనసైనికులే ఎద్దేవా చేస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పేందుకు పవన్ మున్ముందు ఎటువంటి వ్యూహాలతో వెళతారనేది ఆసక్తి కలిగిస్తోంది.