అసెంబ్లీ ఐదురోజులు చాలకపోతే జూమ్, ట్విట్టర్లో పెట్టుకోండి- చంద్రబాబు, లోకేష్పై కొడాలి నాని
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం తర్వాత పలువురు ప్రముఖులకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం బీఏసీలో ఐదురోజుల పాటు సభలు నిర్వహించాలని అధికారపక్షం నిర్ణయించింది. దీనిపై విపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. వీటిపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.
అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్చాట్ మాట్లాడిన మంత్రి కొడాలినాని టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదురోజులు మాత్రమే అసెంబ్లీ నిర్వహించాలన్న వైసీపీ నిర్ణయంపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై కొడాలి స్పందించారు. ఐదురోజుల అసెంబ్లీ చంద్రబాబు, లోకేష్కు సరిపోకపోతే ట్విట్టర్, జూమ్లో సమావేశాలు పెట్టుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సహచర మంత్రి పేర్నినానిపై జరిగిన దాడిని కొడాలి నాని ఖండించారు.
గతంలో సీఎం జగన్, ఇప్పుడు పేర్నినాని కావాలని దాడి చేయించుకున్నారని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. అలిపిరిలో కూడా చంద్రబాబు కావాలనే దాడి చేయించుకున్నారా అని ప్రశ్నించారు. మాకు మా కన్నా ప్రజల భద్రతే ముఖ్యమన్నారు. మంత్రి పేర్నినాని ఎప్పుడూ ప్రజల్లోనే, ప్రజల మనిషిగానే తిరుగుతున్నారని కొడాలి నాని గుర్తుచేసారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని నాని తెలిపారు.