కొడాలి నానీ వర్సెస్ ఎస్ఈసి .. ప్రివిలేజ్ కమిటీ ముందుకు నిమ్మగడ్డ వ్యవహారం .. నోటీసులు ?
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, షోకాజ్ నోటీసుకు కొడాలి నాని సమాధానం చెప్పినప్పటికీ ఆయనపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడం కొడాలి నాని కి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో నానీ మరొక సీరియస్ స్టెప్ తీసుకోబోతున్నట్టు సమాచారం .
హైకోర్టులో మంత్రి కొడాలి నాని పిటిషన్.. ఎస్ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీస్ ను సవాల్ చేస్తూ
ఏపీ మంత్రి కొడాలి నానీ పై ఐపీసీ సెక్షన్ 504, 505, 506 ల కింద కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడంతో కొడాలి నాని ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ షోకాజ్ నోటీసుల వ్యవహారం, అలాగే మీడియాతో మాట్లాడవద్దు అంటూ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్న కొడాలి నాని, ఇక తాజాగా నిమ్మగడ్డ మంత్రి నానీపై కేసు నమోదు చెయ్యాలంటూ వేసిన అడుగుతో, తానేమీ తక్కువ కాదంటూ ప్రివిలేజ్ కమిటీని ఆశ్రయించనున్నారు కొడాలి నాని .
Recommended Video
నిమ్మగడ్డ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చినప్పటికీ తనపై కేసులు నమోదు చేయమని చెప్పి, మంత్రి అయిన తనను అవమానిస్తున్న తీరు, నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరుపై కొడాలి నాని ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ కమిటీకి విచారణ చేయవలసిందిగా ఆదేశించింది. ఇక తాజాగా కొడాలి నాని కూడా ప్రివిలేజ్ కమిటీని ఆశ్రయించనున్న కారణంగా ఒకటి రెండు రోజుల్లో ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డకు నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.