డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి : తండ్రి స్పీకర్గా..తనయుడు డిప్యూటీగా : నాడు కేసీఆర్ సైతం..!
ఏపీ శాసనసభా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఉప సభాపతిగా వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నిక ఇక లాంఛనమే. శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం డిప్యూటీ స్పీకర్కు సంబంధించి నోటీఫికేషన్ విడుదల చేసారు. అయితే, నిర్ధేశిత సమయానికి కేవలం కోన రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేసారు. ఆయనకు మద్దతుగా వైసీపీ నుండి పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసారు. మంగళవారం సభలో ఉప సభాపతిగా కోన రఘుపతి ఎన్నిక పైన సభాపతి అధికారిక ప్రకటన చేయనున్నారు.
ఉప సభాపతిగా రఘుపతి..
ఏపీ శాసనసభా ఉప సభాపతిగా కోన రఘుపతి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా బాపట్ల నుండి రఘుపతి రెండో సారి శాసనసభకు ఎన్నికయ్యారు. సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగా బ్రాహ్మణ వర్గానికి జగన్ కేటినెట్లో స్థానం దక్కలేదు. దీంతో..మంత్రుల ప్రకటన సమయంలోనే బ్రాహ్మణ వర్గానికి డిప్యూటీ స్పీకర్ ఇస్తామని జగన్ అదే రోజు ప్రకటించారు. అందులో భాగంగా..కోన రఘుపతి నామినేషన్ దాఖలు చేసారు. రఘుపతి అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి మద్దతు ప్రకటించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఉప సభాపతి ఎన్నికకు సంబంధించి నోటీఫికేష విడుదల చేసి..సాయంత్రం వరకు నామినేషన్ల దాఖలుకు సమయం కేటాయించారు. అయితే నిర్ధేశిత సమయంలోగా వైసీపీ నుండి కోన రఘుపతి మాత్రమే నామినేషన్ దాఖలు చేసారు. దీంతో..ఉప సభాపతిగా రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఆయన ఎన్నిక పైన స్పీకర్ సభలో అధికారిక ప్రకటన చేయటం లాంఛనమే.
తండ్రి స్పీకర్..తనయుడు డిప్యూటీ..
కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర రావు కాంగ్రెస్ హయాంలో రెండు సార్లు మంత్రిగా పని చేసారు. మహారాష్ట్ర..సిక్కిం రాష్ట్ర గవర్నర్గా పని చేసారు. కోన రఘుపతి తొలి నుండి వైయస్కు సన్నిహితంగా ఉండేవారు. వైయస్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఆయనకు సీటు రాకపోవటంతో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసారు. 2014, 2019లో వైసీపీ నుండి బాపట్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావటంతో ఉత్తరాంధ్రకు చెందని బీసి వర్గానికి స్పీకర్ పదవి ఇవ్వటంతో..ఇప్పుడు రఘుపతికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. సౌమ్యుడిగా పేరున్న రఘుపతి పార్టీ ఏర్పాటు సమయం నుండి జగన్కు విధేయుడిగా ఉంటున్నారు. తాజా ఎన్నికల సమయంలో రఘుపతికి బాపట్ల సీటు ఇవ్వద్దని పలువురు అసంతృప్త నేతలు లోటస్ పాండ్ దగ్డర ఆందోళకు దిగారు. అయినా.. జగన్ మాత్రమే రఘుపతికి సీటు ఖరారు చేసారు. డిప్యూటీ స్పీకర్గా రఘుపతి ఎన్నిక పైన మంగళవారం సభలో స్పీకర్ అధికారిక ప్రకటన చేయనున్నారు.
గుర్తుచేసుకోవాల్సింది కేసీఆర్నే..
డిప్యూటీ స్పీకర్గా ఉంటూ రాజీనామా చేసి.. పార్టీ పెట్టి..నేడు తెలంగాన ముఖ్యమంత్రిగా రెండో సారి కొనసాగుతున్న కేసీఆర్ ను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. సరిగ్గా రఘుపతి డిప్యూటీ స్పీకర్గా నామినేషన్ వేసే సమయంలోనే కేసీఆర్ ఏపీకి వచ్చారు. సీఎం జగన్తో భేటీ అయ్యారు. నాడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వేళ కేసీఆర్కు మంత్రి పదవి ఇచ్చారు. 1999లో తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఉప సభాపతిగా అవకాశం ఇచ్చారు. దీంతో.. 1999, నవంబర్ 17 నుండి 2001 మే1 వరకు ఆ పదవిలో ఉన్నారు. అదే సమయంలో రాజీనామా చేసి టీఆర్యస్ను స్థాపించి..ఉద్యమ పార్టీగా..రాజకీయ పార్టీగా సారధ్యం వహించారు. ఎట్టకేలకు 2014లో తెలంగాణ సాధించి కొత్త రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో గెలిచి తెలంగాణకు రెండో దఫా ముఖ్యమంత్రి అయ్యారు.