చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ట్వీట్ షేర్ చేసిన కలెక్టర్- ఎలా చేస్తారంటూ కేశినేని ఫైర్
గతేడాది వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండగా.. స్వయంగా అధికార వైసీపీ నేతలు చేస్తున్న పోస్టులపై హైకోర్టులో సీరియస్ విచారణ జరుగుతోంది. అదే సమయంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ను షేర్ చేసిన కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వివాదంలో ఇరుక్కున్నారు.
కృష్ణాజిల్లా అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్.. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రభుత్వం చేపట్టిన కొత్త బ్యారేజీ నిర్మాణాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇందులో చంద్రబాబులా కాంట్రాక్టర్ల వెంట పరుగులు తీయకుండా సీఎం జగన్ నేరుగా ప్రభుత్వ నిధులతో బ్యారేజీ కట్టాలని తీసుకున్న ఆలోచనకు ఇది నిదర్శనమని ట్వీట్ పెట్టారు. దీన్ని కృష్ణాజిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇది కాస్తా వివాదాస్పదం అయింది. ప్రభుత్వాధికారిగా ఉంటూ ఓ మాజీ ముఖ్యమంత్రి మీద అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్టిన ట్వీట్ ఎలా షేర్ చేస్తారంటూ విమర్శలు వచ్చాయి.
ఇదే విషయాన్ని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరో ట్వీట్లో ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వైసీపీ ఎమ్మెల్యే ట్వీట్ను ప్రభుత్వ అధికారిగా ఉన్న మీరు రీట్వీట్ చేయడాన్ని ఖండిస్తున్నానని కేశినేని తెలిపారు. అంతటితో ఆగకుండా మీ తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ట్వీట్ను కేశినేని రీట్వీట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల మాయలో పడి సీఐడీ నోటీసులు అందుకుంటుండగా.. ఇప్పుడు కృష్ణాజిల్లా కలెక్టర్ చేసిన పనిపై ప్రభుత్వం స్పందన ఎలా ఉన్నా... బయట మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి.