అగ్గి రాజేసిన వల్లభనేని! ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిన కృష్ణా జిల్లా రాజకీయాలు!
అమరావతి/హైదరాబాద్ : బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. భవన నిర్మాణ కార్మికులకు ఇసుక అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏపి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఒక రోజు దీక్షకు ఉపక్రమించిన రోజే ఆ పార్టీకి కుదుపులకు లోనైంది. తెలుగు యువత అద్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కృష్ట పార్టీని వీడారు. అవినాష్ వైసిపి కండువా కప్పుకుని సైలెంట్గా సైడైపోయారు గాని వల్లభనేని వంశీ మాత్రం రచ్చ రచ్చ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.. పార్టీ ముఖ్య నేతలపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నడని వంశీపై మండిపడుతున్నారు టీడిపి కృష్ణా జిల్లా నేతలు.
ఆస్తులు కాపాడుకునేందుకే పార్టీ మార్పు.. వల్లభనేని వంశీపై భగ్గుమన్న నారా లోకేష్
అగ్గికి ఆజ్యం పోసిన వల్లభనేని.. భగ్గుమంటున్న కృష్ణ జిల్లా రాజకీయాలు..
వంశీ ఎపిసోడ్ లో ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ, బోడే ప్రసాద్ తో పాటు నారా లోకేష్ పేర్లు ప్రథమంగా వినిపిస్తున్నాయి. ఈ నేతలను టార్గెట్ చేస్తూ వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు టీడిపి నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీనుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటే వెళ్లి పోవాలిగాని అనుచిత ఆరోపణలు చేసి వెళ్లిపోవడం సమంజసం కాదని టీడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. పార్టీలో అన్ని రకాలుగా లబ్ది పొందిన తర్వాత ఇప్పుడు దూషించడం మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబును గాని, లోకేష్ను గాని వ్యక్తి గతంగా విమర్శిస్తే సహించేది లేదని కృష్టా జిల్లా టిడిపి నేతలు వంశీని హెచ్చరిస్తున్నారు.
వంశీ పై మండిపడుతున్న టీడిపి నేతలు.. పిచ్చి ఆరోపణలు ఆపాలని హెచ్చరికలు..
కాగా వంశీ మాత్రం స్వార్థ రాజకీయాల కోసమే పార్టీ మారినట్టు టీడిపి నేతలు విశ్లేషిస్తున్నారు. ఐతే రాజకీయాల్లో వ్యక్తుల పార్టీ మార్పు కొందరికి కలిసొస్తుంది. మరికొందరికి శరాఘాతంలా పరిణమిస్తుంది. అధికారానికి ముందు పార్టీ మారిన వారికి పదవులు దక్కితే, అధికారం వచ్చాక పార్టీ మారిన వారికి వ్యాపార స్వప్రయోజనాలు తప్ప పదవీ ప్రయోజనాలు దాదాపు ఉండవు. ఎందుకంటే స్వార్థ రాజకీయాలకు శాశ్వత ప్రయోజనాలు ఎప్పుడూ ఉండవు. తాజాగా తెలుగుదేశం పార్టీ వీడిన దేవినేని అవినాష్, వల్లభనేని వంశీలు పార్టీ ఎందుకు మారారో ప్రజలందరికీ తెలిసిందేనని పలువురు నేతలు స్పష్టం చేస్తున్నారు.
వంశీ లాంటి వారు పోతే నష్టమేమీ ఉండదు.. పార్టీకి మంచి రోజులొచ్చాయన్న నారా లోకేష్..
వల్లభనేని వంశీ పార్టీ నేతలపైన తనపైన చేసిన ఆరోపణలకు నారా లోకేష్ స్పందించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంత మంది చీడ పురుగులు పోతే పెద్ద నష్టం ఉండదని, కార్యకర్తల మూలంగా పార్టీ మనగలుగుతుంది కానీ స్వార్థ రాజకీయాలు చేసే నేతల మూలంగా కాదని లోకేష్ చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం గత ఆర్నెల్లుగా పరిపాలన వదిలేసిందని ఘాటు విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం వారిని ఎలా వేధించాలా అని మాత్రమే ఆలోచిస్తూ పనిచేసుందని లోకేష్ ఆరోపించారు. అలాంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ గాని, నేతలు గాని భయపడే ప్రసక్తే లేదని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఆస్తులు కోసమే పార్టీ మార్పు.. వంశీ దిగజారుడు రాజకీయాలన్న లోకేష్..
పార్టీ మారకుండానే పార్టీ పైన విషం చిమ్మారని వల్లభనేని వంశీ పేరును ప్రస్తావిస్తూ, ఆయన ఆస్తి గొడవల వల్ల పార్టీ మారుతున్నారని పేర్కొన్నారు. భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి పార్టీ మారారు అని లోకేష్ వ్యాఖ్యానించారు. లోకేష్ వ్యాఖ్యలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోకేష్ దీనిని సాధారణ అంశంగా పరిగణిస్తున్నారని కొందరు అంటుంటే, వల్లభనేని వంశీ ఎపిసోడ్ వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారిందని మరికొందరు నేతలు తమ అబిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అమరావతి రాజకీయాల్లో ముఖ్యంగా కృష్ణా జిల్లా లో రాజకీయాలు మాత్రం భగ్గుమంటున్నాయి.