చంద్రబాబు ఇంటిని చుట్టుముట్టిన వరద: కాన్వాయ్..సామాన్లు తరలింపు: జగన్ చెప్పిందే జరిగింది..!!
ఊహించిందే జరిగింది. అమరావతి కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణాలకు వరద ముంపు పొంచి ఉందని తొలి నుండి అధికారులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాకు తగినట్లుగానే ప్రస్తుతం క్రిష్టా నదిలో వరద పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని దిగువకు విడుదల చేసారు. కరకట్ట వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలకు వరద నీటి ఎఫెక్ట్ మొదలైంది. అందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న నివాసం చుట్టూ వరద నీరు ప్రవాహం పెరిగింది. చంద్రబాబు ప్రస్తుతం హైరదాబాద్ లో ఉన్నారు. ఆయన ఇంటి చుట్టూ ఇసుక బస్తాలు వేసి నీరు నివాసంలోకి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ను..కింద అంతస్తులో ఉన్న సామన్లను తరలిస్తున్నారు. దీంతో..ఇప్పుడు టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిందే జరుగుతోంది. దీంతో.. ఇక ఇప్పుడు కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
చంద్రబాబు ఇంటి చుట్టూ ఇసుక బస్తాలు...
అమరావతిలో కరకట్ట వద్ద నివాసం ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద వదర నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రకాశం బ్యారేజి వద్ద వదర ప్రవాహం ఎక్కువ గా ఉండటంతో అధికారులు నీటిని కిందకు వదిలారు. కరకట్టతో పాటుగా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముందు నుండి అంచనా వేస్తున్నట్లుగానే వరద ప్రవాహం కారణంగా కరకట్ట వద్ద ఉన్న అక్రమ నిర్మాణాల పైన ప్రభావం పడింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి చుట్టూ నీరు పోటెత్తుతోంది. దీంతో..అధికారులు వెంటనే ఆయన నివాసం చుట్టూ ఇసుక బస్తాలు వేస్తున్నారు. చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన కాన్వాయ్ ను సైతం నివాసం నుండి హ్యీపీ రిస్టార్ట్స్ కు తరలించారు. బాబు నివాసంలోని కింది అంతస్తులో ఉన్న ముఖ్యమైన వస్తువులను సైతం మొదటి అంతస్థులోకి తీసుకెళ్లారు. చంద్రబాబు ఇక్కడ నివాసం ఉంటున్న సమయం నుండి ఈ స్థాయిలో నదికి వరద రాకపోవటంతో ఇప్పటి వరకు ఈ సమస్య తలెత్తలేదు. ఇక, ఇప్పుడు వరద కారణంగా..అక్రమ నిర్మాణల పైన వదర నీటి ప్రభావం పడింది. సీఆర్డీఏ అధికారులు అక్రమ నిర్మాణాల్లో ఉంటున్న వారిని అప్రమత్తం చేసారు.
వరద నీటిలో బాబు వాకింగ్ ట్రాక్..
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నదికి అభిముఖంగా నివాసం ఉండాలనే కోరికతో చంద్రబాబు ఈ నివాసం ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ మెట్ల వరకు ప్రస్తుతం వరద నీరు చేరింది. అదే విధంగా చంద్రబాబు ఉపయోగించే వాకింగ్ ట్రాక్ పైన వరద నీరు ప్రవహిస్తోంది. అర్దరాత్రి వరద ప్రవాహాన్ని గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే తొమ్మది లారీల ఇసుక ను తెప్పించారు. ఇంటి చుట్టూ ఇసుక బస్తాలు వేస్తున్నారు. నివాసంలో ప్రతీ రోజు కనిపించే మాజీ మంత్రి లోకేశ్ కాన్వాయ్..ప్రయివేటు వాహనాలు సైతం మంగళగిరికి తరిలించారు. ప్రస్తుతం ఆయన నివాసంలో కూలీలు..నీరు లోపలకు రాకుండా అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. నదీ భూగర్భంలో ఉన్న నిర్మాణం కావటంతో వరద మరింత ఎక్కువైతే ఇబ్బందులు తప్పవని అధికారులు సూచిస్తున్నారు. దీంతో..ఇతర నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. చంద్రబాబు నివాసం వద్ద పరిస్థితి అంచనా వేసే వారంతా హైదరాబాద్ వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు.
సీఎం జగన్ చెప్పిందే జరిగింది...
కొద్ది రోజుల క్రితం ప్రజా వేదికను కూల్చివేయటం పైన టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. వరద ప్రవాహం వస్తే ఈ అక్రమ నిర్మాణాల కారణంగా ముంపు ఏర్పుడుతందని ముఖ్యమంత్రి శాసన సభా వేదికగా వివరించారు. అయితే, జగన్ చెప్పిన విషయాలతో చంద్రబాబు ఏకీభవించినా..తాను అద్దెకు మాత్రమే ఉంటున్నానంటూ సమర్ధించుకొనే ప్రయత్నం చేసారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు చేతికి గాయం ..విశ్రాంతి కారణంగా హైదరాబాద్ వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు సైతం కరకట్ట నివాసంలో లేరు. దీని ద్వారా వారు ముందుగానే ఈ పరిస్థితిని అంచనా వేసారా అనే చర్చ మొదలైంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో కరకట్ట వద్ద ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో యజమానులు .. ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందీ.. ఇప్పుడు చంద్రబాబు ఏం చెబుతారనేది ఆసక్తి కరంగా మారింది.