వాడుకుంటున్నది చాలు..!మళ్లీ అదనపు వాటా ఎందుకంటూ ఏపీకి కృష్ణా రివర్ బోర్డు లేఖాస్త్రం..!!
అమరావతి/హైదరాబాద్ : కృష్ట నదీ జలాల వినియోగం, పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపు, మిగులు జలాల తరలింపుకు సంబంధిన అంశం కృష్టా నది లాగా కీలక మలుపులు తీసుకుంటోంది. పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపు, మిగులు జలాల వినియోగం గురించి ఏపి ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వును విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఇరు రాష్ట్రాల వివాదం కూడా చెలరేగింది. తెలంగాణ మంత్రుల సందేహాలకు ఏపి మంత్రుల ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోడంతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డు ఫిర్యాదు చేసింది. ఇదే అంశంపై లోతైన విచారణ జరిపిన కృష్ణా రివర్ బోర్డు ఏపి ప్రభుత్వానికి లేఖ రాసింది.
మిగులు జలాల వాడకం వద్దు.. ఏపికీ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు లేఖ..
కాగా పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని పెంచడం, శ్రీశైలంలో అదనపు నీటిని మాత్రమే ఎత్తిపోసుకుంటామని ఏపి ప్రభుత్వం ఇచ్చిన వివరణతో కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు అంగీకరించని పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఏపి ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు రాసిన లేఖ సంచలనంగా మారింది. వాడుకున్న జలాలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం ఎలాంటి అదనపు వాడకాన్ని కూడ అంగీకరించేది లేదని లేఖలో స్పంష్టంగా పేర్కొంది. దీనిపై ఏపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది. లేఖలోని సారాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నాక ఏపి ప్రభుత్వం స్పందించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
వాడకం ఎక్కువైంది.. ఇక ఆపాలని ఏపి ప్రభుత్వానికి కృష్ణా బోర్డు విజ్ఞప్తి..
కృష్ణా నదీ జలాల వినియోగం, భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మద్య యుద్ద వాతావరణం చోటుచేసుకోగా, కృష్ణా రివర్ బోర్డు ఏపీ ప్రభుత్వానికి లేఖ రూపంలో షాకిచ్చింది. పోతిరెడ్డిపాడు వద్ద రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుకునేందుకు ప్రణాళిక రచిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే కృష్ణా జలాలను అదనంగా తరలించుకునే ఆవశ్యకత ఎందుకని, దానిని తక్షణం ఆపాలని కృష్ణా రివర్ బోర్డు విజ్ఞాపన పత్రం పంపింది. ఈ మేరకు ఏపీ ఇంజనీర్-ఇన్-చీఫ్కు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఛైర్మెన్ మంగళవారం లేఖ రాశారు. ఇరు రాష్ఠ్రాల రాజకీయాలు ఇప్పుడు ఇదే లేఖపై చర్చ జరుపుతున్నట్టు తెలుస్తోంది.
విస్మయం వ్యక్తం చేసిన ఏపి.. ఆచితూచి స్పందించనున్న జగన్ సర్కార్..
శ్రీశైలం ప్రాజెక్టు మిగులు జలాలను తరలించుకునేందుకు ఉద్దేశించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, తాజాగా ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మద్య విద్వేషాలు చెలరేగాయి. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్మించిన పలు ప్రాజెక్టులపై ఏపీ ఒకేసారి కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు ఫిర్యాదు చేసింది. ఇంకోవైపు కృష్ణా నదిలో నీళ్ళు లేవంటూ, గోదావరి జలాలను వాడుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి స్నేహపూర్వకంగా సూచించిన అంశం కూడా తెలిసిందే.
Recommended Video
ఇప్పుడేం చేయాలి..? క్రిష్ణ బోర్డ్ లేఖతో మొదటికొచ్చిన వ్యవహారం..
కాగా రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్న తరునంలో కృష్ణా రివర్ బోర్డు ఏపీకి విస్మయాన్ని కలిగిస్తూ అకస్మాత్తుగా లేఖ రాసింది. కేటాయించిన దానికంటే ఎక్కువగా కృష్ణా నదీ జలాలను వాడుకుంటున్నారంటూ ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు లేఖ రాసింది. సాగర్ కుడి కాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి నుంచి ఎక్కువ నీటిని ఆంధ్ర ప్రదేశ్ వాడుకుంటోందని, ఇకనైనా నీటి వాడకాన్ని నిలిపివేయాలని ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ శాఖకు మంగళవారం పంపిన లేఖలో కృష్ణా రివర్ బోర్డ్ ఛైర్మెన్ పేర్కొన్నారు. దీంతో ఏపి ప్రభుత్వం పోతిరెడ్డి పాడులో చేస్తున్న ప్రాజెక్టు పనులకు తాత్కాలిక బ్రేకులు పడ్డట్టు తెలుస్తోంది.