జగన్ పర్యటన సమయంలో అపశృతి- ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు- భక్తులకు గాయాలు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా భక్తుల రాక పెరిగింది. ఇవాళ మూలానక్షత్రం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇవాళే సీఎం జగన్ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. అంతలోనే ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటు చేసుకుంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నానిపోయిన బండరాళ్లు కుంగడంతో వాటి నుంచి కిందకు పడ్డాయి. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులపై అవి పడటంతో వారు గాయాల పాలయ్యారు. కొండచరియలు విరిగి పడిన సమయంలో ఆలయ సిబ్బంది కూడా కొందరు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. వారికి కూడా గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు బాధితులకు తక్షణ సాయం అందించారు. ఆ ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టారు.
టెంట్ కి సంబంధించిన సపోర్టింగ్ రాడ్స్ విరిగిపోవడంతో టెంట్ లో ఉన్న మీడియా సిబ్బందిని అధికారులు ఖాళీ చేయించారు. భక్తులను కొండ మార్గంలో రానివ్వకుండా ఆంక్షలు విధించారు. కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. విరిగిపడిన కొండ చరియల కింద బాపట్ల మండలం, చెరువుదివ్వెల గ్రామానికి చెందిన గండికోట బ్రహ్మయ్య, రమణ అనే భక్తులు ఉన్నట్లు సమాచారం.
Recommended Video
కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో దుర్గమ్మ దర్శనానికి వస్తున్న సీఎం జగన్ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేశారు. అలాగే ప్రధాన ద్వారం గుండా కాకుండా మహామండపం లిఫ్ట్ మార్గంలో సీఎం జగన్ దర్శనానికి వెళ్తున్నారు. జగన్ రాక సందర్భంగా భారీ బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. షెడ్యూల్ ప్రకారం జగన్ సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి దర్శనానికి రావాల్సి ఉంది. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాక జగన్ తిరిగి వెళతారు.