ఇంద్రకీలాద్రిపై భక్తుల ఇక్కట్లు..! టిక్కెట్లు కొన్నా ఉపయోగం లేదన్న దేవినేని ఉమా..!!
విజయవాడ/హైదరాబాద్: మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ ఓ సాహసం చేసారు. దేవి శరన్నవరాత్రులు అత్యంత దేదీప్యమానంగా కొనసాగుతున్న తరుణంలో కాలి నడకన క్యూ లైన్లో అమ్మ వారిని దర్శించుకున్నారు. లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గ మాతాను దర్శనం సందర్బంగా వైసీపి ప్రభుత్వ ఏర్పాట్లపై మండిపడ్డారు దేవినేని ఉమ మహేశ్వరరావు. అధికార పార్టీ నేతల హడావిడితో రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఎక్కువగా కనబడుతున్నాయని విమర్శించారు.
దేవాదాయ శాఖ మంత్రి నేతృత్వంలో అనేక అవకతవకలు జరగుతున్నాయని విమర్శించారు. మూడు వందల రూపాయల టిక్కెట్లు కొన్న భక్తుల కూడా గంటల తరబడి క్యూలైన్లో నిలుచుంటున్నారని, అదికార పార్టీ నేతలు మాత్రం రాజమార్గంలో క్షణాల్లో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, ప్రతి సంవత్సరం ఇంతకన్నా రెట్టింపు వచ్చే భక్తులు తాజాగా చాలవరకు తగ్గిపోయారని అన్నారు. ప్రజల ఆదాయాలు పడిపోవడమే కాకుండా ఇసుక కొరతతో ఉపాది కోల్పోయిన ప్రజలు ఆలయానికి రాలేకపోయారని తెలిపారు. అంతే కాకుండా అన్న ప్రసాదంలో నాణ్యత పెంచాలని, 60కోట్ల భక్తుల విరాళాల నుండి వచ్చే వడ్డీతో కీలక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
దీంతో పాటు దుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ పనులు వేగంగా పూర్తి చేస్తే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని దేవినేని ఉమ ప్రభుత్వానికి సూచించారు. ఇదిలా ఉండగా నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు క్యూలైన్లలో కిటకిటలాడుతున్న భక్తుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొందరు భక్తులు సీపీ ఎదుటే అసహనం వ్యక్తం చేశారు. ఏర్పాట్లలో లోపాలు అదికారుల నిర్లక్ష్యం పై దేవస్థానం ఈవో ఎం.వి. సురేష్బాబు, ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చించారు.