ముగిసిన అసెంబ్లీ సమావేశాలు..! ఏపి ప్రజల మనసులను జగన్ మెప్పించారా..? నొప్పించారా..?
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో శాసన సభ సమావేశాల ద్వారా యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంశంలో జనాల్లో నెలకొన్న ఆసక్తి చల్లబడిందా లేక ఉత్సాహంతో ఉరకలేస్తోందా.? శాసన సభలో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అడుగుపెట్టిన జగన్ ప్రజల ఆకాంక్షల మేరకు వ్యవహరించారా..? లేక ఏకపక్షంగా వ్యవహరించారా.? అనే అంశాలపై పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ జగన్ వ్యవహరించాడనే చర్చ కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రజా సంక్షేమం కోసం కొత్త చట్టాలను రూపొందించండం ప్రజల్లో ఆధరణ పొందినప్పటికీ ప్రతిపక్షం పట్ల జగన్ తో పాటు తన ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు పట్ల ప్రజల్లో మిశ్రమ స్పందన వచ్చినట్టు తెలుస్తోంది.
ముగిసిన సమావేశాలు..! నూతన సీఎం గా జగన్ వ్యవహారంపై జరుగుతున్న చర్చ..!!
ఏపీ శాసన సభ సమావేశాలు ముగిశాయి. మరి జగన్ జనం మెప్పు పొందారా..? లేక స్వీయ భజనతో కాలం వెళ్లబుచ్చారా..? ఇవన్నీ కాసేపు పక్కనబెడితే ఓట్లు వేసి గెలిపించిన జనంలో మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. తామెన్నో ఆశలతో చంద్రన్నను ప్రతిపక్షంలోకి పంపితే ఇప్పుడు వచ్చిన జగన్ కూడా అదే తాను లోని ముక్కనంటూ నిరూపించుకున్నారనే విమర్శలకు అవకాశమిచ్చారు. ప్రజల సున్నితమైన ఎమోషన్ ను అర్ధంచేసుకోవటంలో వైసీపీ అధినేత విఫలమయ్యారనే భావన కూడా మరో వర్గంలో వినిపిస్తుంది.
వైయస్ మార్క్ పాలన..! జగన్ అందించ గలుగుతున్నారా..?
ఇక తాను పదవిలోకి రాగానే వైఎస్ పాలన చూపుతానంటూ చెప్పటాన్ని, ఎన్నికల ప్రచారంలో మాటలను నిజంగానే జనం విశ్వసించారు. జగన్ తండ్రి బాటలో నడుస్తాడనుకున్నారు. కానీ.. జగన్ రావటమే టీడీపీను బలహీనం చేయాలనే రాజకీయ దురుద్దేశం కనిపించింది. ప్రజా దర్బార్ కూల్చివేతతో పెంచుకున్న అంచనాలు సభలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అతి భజనతో కొట్టుకుపోయింది. దీన్ని ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన జగన్ అప్పటికే పరిస్థితి చేయి దాటడంతో ప్రశంసలను ఆస్వాదించటం మినహా ఏమి చేయలేకపోయారు.
హద్దులు మీరిన ఎమ్మెల్యేలు..! పార్టీ ఇమేజ్ కు డ్యామేజే..!!
పోలవరంపై రివర్స్ టెండరింగ్ తెస్తామంటూ మరో భాంబు పేల్చారు ఏపి సీఎం. నిజంగానే అవినీతి జరిగి ఉంటే విచారణ తరువాత చెప్పాల్సిన మాటలను కూడా ముందుగానే అనేశారు. కేంద్రం కూడా పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పటంతో దాన్ని ఎలా నిరూపించాలనే ఎత్తులతో సభా సమయాన్ని దుర్వినియోగం చేశారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయటం ద్వారా వైసీపీ తాను కూడా తాజా రాజకీయాలకు అతీతమేమీ కాదని చాటుకుంది. జగన్ కూడా మరో అడుగు ముందుకేసి చంద్రబాబును దుమ్మెత్తిపోయటం.. అదే బాటలో ఎమ్మెల్యేలు సైతం తామేమీ తక్కువతినలేదని బాబును లక్ష్యం చేసుకోవటం జనం గమనిస్తున్నారనేది మరచిపోయారు. ఇందులో కోటం రెడ్డి శ్రీదర్ రెడ్ది, అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారం శృతిమించినట్టుగా కూడా చర్చ జరుగుతోంది.
ప్రతీకార రాజకీయాలా..! ప్రజా సంక్షేమం కోసం చర్చలా..?
ఇది నిజంగానే టీడీపీ వైపు సానుబూతికి కారణమైంది. చంద్రబాబు అప్పులు, అవినీతితో అయినా జనం కోసం ఏదోకటి చేశాడు. జగన్ ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడనే వాదన బలపడుతోంది. తెలంగాణలో నేతలు దోస్తీ చేయవచ్చు. కానీ.. రాష్ర్ట విభజన తరువాత ఏపీ ప్రజలు తెలంగాణకు దూరం జరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా ఆంధ్రుల పట్ల చాలా చులకనగా మాట్లాడారు. ఇప్పుడు అదే చంద్రశేఖర్ రావు తో జగన్ సన్నిహితంగా మెలగటాన్ని కూడా ఏపీలో అత్యథిక ప్రజలు ఇష్టపడట్లేదు. ఇలా ప్రతి సున్నితమైన అంశాన్ని ప్రజల కోణం నుంచి గాకుండా కేవలం తన రాజకీయ కక్షలకు వేదికగా చేసుకోవటం జగన్ భవిష్యత్ రాజకీయాలపై పెను ప్రభావం చూపుతుందనే అభిప్రాయం అమరావతి వ్యాప్తంగా వ్యక్తమవుతుంది.