విజయవాడలో లాక్ డౌన్ .. రోడ్లపైకి వస్తే కఠిన చర్యలే ..వార్నింగ్ ఇస్తున్న పోలీసులు
కరోనా వైరస్ పై దేశం పోరాటం చేస్తుంది . దేశంలో తీవ్రంగా కరోనా వైరస్ మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ అయ్యింది . ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షట్ డౌన్ చేస్తున్నామని ప్రకటించారు. అంతే కాదు దేశంలో కరోనా ప్రభావిత జిల్లాలను లాక్ డౌన్ చేస్తూ కేంద్రం కూడా ప్రకటన చేసింది. ఇక ఈ నేపధ్యంలో విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో విజయవాడలో లాక్ డౌన్ ప్రకటించారు. ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా భయం ... ఎటైనా వెళ్లి వచ్చారా .. అయితే గ్రామాల్లో నో ఎంట్రీ
విజయవాడలో పోలీసుల నిబంధనలు కఠినం
విజయవాడ నగరంలో లాక్డౌన్ విషయంలో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విజయవాడలో ప్రజలు లాక్ డౌన్ ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ బయట తిరుగుతున్న నేపధ్యంలో పోలీసులు హెచ్చర్కలు జారీ చేస్తున్నారు. ఇక ప్రజలు లాక్ డౌన్ ను పట్టించుకోకుండా బయటకు వస్తున్న నేపధ్యంలో సోమవారం పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రజలకు సూచనలతో పాటు బయట తిరగావద్దని ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నారు .
రోడ్లపైకి వచ్చిన వారిని నియంత్రించే పనిలో పోలీసులు
విజయవాడలో లాక్డౌన్ను లెక్కచేయకుండా రోడ్లపైకి ప్రజలు వస్తున్నారన్న ఆయన అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య ఎక్కువ అవుతుందని అటువంటివారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించమని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. రోడ్లపైకి వచ్చిన వారిని నియంత్రించే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పారు. ఇక అన్ని ప్రధాన కూడలిలో బారికేడ్స్ పెట్టి వాహనాలు నియంత్రణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
వాహనాలను ఆపి, వెనక్కి పంపుతున్న పోలీసులు
ఇక కరోనా పాజిటివ్ నమోదైన కొత్తపేట ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని కమిషనర్ చెప్పారు. అంతే కాదు మూడు కిలోమీటర్ల పరిధిలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఇక ప్రజలను బయటకు రావద్దని , గుంటూరు జిల్లా నుంచి బ్యారేజీ మీదుగా వచ్చే వాహనాలు సైతం సీతానగరం వద్ద నుంచి వెనక్కి పంపించి వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు .
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
నిబంధనలు వ్యతిరేకించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమీషనర్ హెచ్చరించారు. ఎవరికి వారు వారి వారి నివాసాల సమీపంలో దుకాణాలవద్ద నిత్యావసర వస్తువులు , కూరగాయలు కొనుక్కోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఇక విజయవాడ ప్రజలు తమను తాము రక్షించుకోటానికి పోలీసులు చేస్తున్న సూచనలు తీసుకోవాలని , జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.