అదృష్టం అంటే వైసీపీ నేత మల్లాది విష్ణుదే... ఎందుకో తెలుసా ?
ఏపీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు పై చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ స్థానం కోసం పట్టుబట్టి వంగవీటి రాధా ఏకంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ స్థానం గురించి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అలాంటి విజయవాడ సెంట్రల్ నుండి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మల్లాది విష్ణు ను అదృష్టం వరించింది.
ఓటు చాలా విలువైనది. ఒక్క ఓటు కూడా నేత భవిష్యత్ నిర్ణయిస్తుంది అంటారు. అందుకే ప్రతి ఒక్క ఓటును ఎంతో విలువైనదిగా పరిగణిస్తుంటారు. ఏపీలో ఎంతో కీలకమైన విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమ, వైసీపీ నుంచి మల్లాది విష్ణు పోటీచేశారు. కాగా వీరి మధ్యన పోటీ చాలా హోరాహోరీగా నడిచింది .
జగన్ డ్రీం కేబినెట్ సిద్దం: స్పీకర్గా ఇద్దరి పేర్లు పరిశీలన: మంత్రుల శాఖలు ఖరారు..!
విజయవాడ సెంట్రల్ స్థానంలో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో కూడా మొదటి రౌండ్ నుంచి గట్టి పోటీ ఉండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు టీడీపీ అభ్యర్థి బొండా ఉమా , వై సీపీ అభ్యర్థి మల్లాది విష్ణులు . ఇక ఈ నేతల్లో చివరికి వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణునే విజయం వరించింది. అది కూడా కేవలం 15 ఓట్లతో మాత్రమే. దాంతో తన గెలుపు పట్ల మల్లాది విష్ణు, ఆయన పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. అదృష్టం అంటే మల్లాది విష్ణుది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కృష్ణా జిల్లాలోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బోండా ఉమా కేవలం 15 ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆయన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో బోండా ఓటమిపాలయ్యారు. అత్యల్పమైన మెజారిటీ కావడంతో ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ చివరి క్షణం వరకు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇద్దరి మధ్య చాలాసేపు దోబూచులాడిన విజయం అంతిమంగా మల్లాది విష్ణునే వరించింది. కేవలం 15 ఓట్లతో గెలవటం అంటే అదృష్టమేగా మరి.