దేవినేని ఉమా గురించి ఆ విషయం అందరికీ తెలుసు : మంత్రి అనిల్ కామెంట్స్
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై టీడీపీ మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు. దేవినేని ఉమాతో పాటు టీడీపీ నేతలు పోతిరెడ్డిపాడుపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడేది టీడీపీ నేతలే అని విమర్శించారు. ఆదివారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో మొట్టమొదటిసారిగా సోమశిల జలాశయంలో 78 టీఎంసీల నీరు నిల్వ చేసిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. ఈ సారి 9 లక్షల ఎకరాలకు మొదటి పంటకు నీరు ఇచ్చామని.. 2 లక్షల 70వేల ఎకరాలకు రెండో పంటకు నీరు ఇస్తున్నామని చెప్పారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పోలవరం ప్రారంభమైందన్నారు మంత్రి అనిల్. పోలవరం విషయంలో తప్పుడు లెక్కలు చెప్పవద్దని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టులో పునారావాసం కూడా భాగమన్నారు. టీడీపీ హయాంలో కాంట్రాక్టర్ల నుంచి ఎంత వసూలు చేశారో అందరికీ తెలుసునని ఆరోపించారు. ఐదేళ్లు దేవినేని ఉమా కాంట్రాక్టర్లను,అధికారులను అడ్డగోలుగా వాడుకున్నారని ఆరోపించారు. పదవుల కోసం ఉమా ఎవరిని చంపాడన్న విషయం కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసన్నారు.
Recommended Video
రెండు రోజుల క్రితం అనిల్ మాట్లాడుతూ.. ఉమా మంత్రిగా ఉన్న సమయంలో పోతిరెడ్డిపాడు ద్వారా ఎంత నీరు తీసుకువచ్చారో తేలుద్దామా అని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దేవినేని ఉమా నిత్యం అబద్దాలు చెబుతూనే ఉంటారని, అన్ని ప్రాజెక్టులు తామే కట్టామని గొప్పలు పోతున్నారని మండిపడ్డారు.