నిన్నూ,నీ కొడుకును టీడీపీ క్యాడరే సాగనంపుతారు.. ఆ మాట అనడానికి సిగ్గూ,శరం ఉందా : బాబుపై కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు... అంతా కట్టకట్టుకుని వచ్చినా సరే... ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఆపలేరని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో 13వేల పైచిలుకు గ్రామ పంచాయతీలు ఉంటే... అందులో 11వేల పంచాయతీలు వైసీపీనే గెలుచుకుంటుందన్నారు.అడ్డంకులు సృష్టించేవారు జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారని హెచ్చరించారు. గ్రామాల్లో ఏకగ్రీవాలకు టీడీపీ శ్రేణులు ముందుకొస్తుంటే చంద్రబాబు నాయుడు వారిని బలవంతంగా పోటీలో దింపుతున్నారని అన్నారు.
తేజస్విని ఆత్మహత్య కలచివేసింది... ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు... : చంద్రబాబు నాయుడు
అంతా డ్రామా...
'వయసు రాగానే బుద్ది రాదు.. వయసుతో పాటు బుద్ది పెరగాలి. చంద్రబాబును ఎలాగైనా అధికారంలోకి తీసుకొచ్చేందుకు కొంతమంది వ్యక్తులు,మీడియా ఆరాటపడుతున్నారు. నాలుగు దఫాల్లో పంచాయతీ ఎన్నికలు వాళ్లే పెట్టించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా గొప్ప వ్యక్తి అని,అనుభవజ్ఞుడు అని పొగిడిన చంద్రబాబే.. ఈరోజు ఆయనపై విమర్శలు చేస్తున్నాడు. ఇదంతా డ్రామా. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు ఈ డ్రామాకు తెరలేపారు.' అని కొడాలి నాని విమర్శించారు.
ప్రపంచ సమస్య వచ్చినట్లు రాద్దాంతం...
పేదవాడికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడితే దానిపై కూడా తెగ ఏడుస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. 9వేల పైచిలుకు వాహనాలతో... 1 కోటి 40లక్షల మంది పేదలకు రేషన్ సరుకులు సప్లై చేయడంతో పాటు,10వేల మందికి జీవనోపాధి కల్పించే సదుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందన్నారు. దానికి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం వల్ల ఏపీలో ఏదో ప్రపంచ సమస్య వచ్చినట్లు రాద్దాంతం చేశారన్నారు.
టీడీపీ క్యాడరే సాగనంపుతారు...
ప్రజలను నమ్మి,ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చి.. ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొడాలి నాని పేర్కొన్నారు. ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారని... ప్రజల్లో ఉన్న బలం ఉన్న నేతను ఎవరు ఏమీ చేయలేరని అన్నారు. వైసీపీ పతనం ప్రారంభమైందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడాన్ని తప్పు పట్టారు.ఆ మాట అనడానికి చంద్రబాబుకు సిగ్గూ,శరం ఉందా అని ప్రశ్నించారు. ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. వైసీపీ మీద వ్యతిరేకత పెరగడం కాదు... పంచాయతీ,మున్సిపాలిటీ,జిల్లా పరిషత్ ఎన్నికలు ముగిసేనాటికి టీడీపీ క్యాడరే నిన్ను,నీ కొడుకును పార్టీ నుంచి సాగనంపుతారని చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. ఇకనైనా జ్ఞానం తెచ్చుకుని హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.