చొక్కా పట్టుకొండి, బూటు విసరండి, మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.
ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజధానికి సంబంధించి తాను నిజాలు చెప్తున్నానని తప్పు చెప్పడం లేదని పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్తానని, తమ ప్రభుత్వం కూడా నిజమే చెబుతోంది తప్పా అబద్దాలు చెప్పదు, చెప్పబోదని స్పష్టంచేశారు.
5 వేల కోట్ల కాదు 9 వేల కోట్లు, పేర్ని నాని అసత్యాలు వల్లెవేశారు, అభివృద్ధితో సంపద: చంద్రబాబు
నిజాలే చెప్పా..
రాజధాని నిర్మాణం కోసం లక్షా 9 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. వివిధ అంశాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించే సమయంలో తాను ఎప్పుడూ అబద్దం చెప్పలేదన్నారు. ఒకవేళ అసెంబ్లీలో గానీ, మీడియా సమావేశంలో గానీ తప్పు చెబితే తన చొక్కా పట్టుకోవాలని సూచించారు. మంత్రులు, సీనియర్ నేతలపై ఇంక్ చల్లి, బూటు విసిరి మీడియా ప్రతినిధులు నిరసన తెలియజేస్తారు కదా అని గుర్తుచేశారు.
బూటు విసరండి..
ఆ సందర్భాన్ని చెప్పి అవసరమైతే తనపై బూటు కూడా విసరమని మంత్రి సూచించారు. మంత్రి వ్యాఖ్యలతో అక్కడున్న మీడియా ప్రతినిధులే ఆశ్చర్యపోయారు. మంత్రి పేర్ని నాని ఇలా అంటున్నారేంటి అంటూ విస్మయం వ్యక్తం చేశారు. తర్వాత చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైరయ్యారు మంత్రి పేర్ని నాని. అసెంబ్లీ, సెక్రటేరియట్ వేస్ట్ అంటోన్న చంద్రబాబు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు.
మేధావులు..
రాజధానిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ నిపుణులు, నిష్ణాతులు అని పేర్ని నాని పేర్కొన్నారు. తను, చంద్రబాబు, లోకేశ్ మాదిరి కాదని తనపై కూడా సెటైర్లు వేసుకొన్నారు. జీఎన్ రావు రిటైర్డ్ ఐఏఎస్ అని, వివిధ ప్రభుత్వాల్లో ముఖ్యపాత్ర పోషించారని చెప్పారు. రాజధాని కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.5 వేల కోట్లకు ఏడాదికి రూ.575 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని చెప్పారు. అలా లక్షకోట్లకు ఎంత వడ్డీ అవుతుందో గ్రహించాలని పేర్ని నాని సూచించారు. 29 గ్రామాల రైతులు ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు.
పంచాయతీ రిజర్వషన్లు
2011 జన గణన ఆధారంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్ శాతాన్ని వెల్లడించారు. ఎస్టీలకు 6 శాతం, ఎస్టీలు 19 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.
108 అంబులెన్స్లు..
108 కోసం 412, 104 కోసం 656 అంబులెన్సులు మార్చి 31వ తేదీ లోపు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. కడప జిల్లా రాయచోటిలో వక్ప్ బోర్డుకు 4 ఎకరాల భూమిని బదలాయిస్తున్నట్టు నాని చెప్పారు. ఇటీవల రాయచోటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.