వంశీ నివాసానికి నాని ద్వయం: వారిచ్చిన హామీ ఏంటి: ఏం జరుగుతోంది..!
గతం వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీ వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం నడుమ వంశీ ఎపిసోడ్ లో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వంశీ వైసీపీలో చేరటానికి ముహూర్తం సైతం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయన పార్టీ మారకుండా నివారించేందుకు టీడీపీ నుండి ఒత్తిడి పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు నేతల ద్వారా వంశీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ బెదిరింపులకు లొంగింతే ఒక అంతే అంటూ..మాస్ లీడర్ నిలబడగలిగితేనే మరింత మాస్ లీడర్ గా ఎదుగుతారని చెప్పుకొచ్చారు. మరో వైపు టీడీపీ గన్నవరం నేతలు మాత్రం వంశీ పార్టీ వీడినట్లుగానే నిర్ణయించేసారు. చంద్రబాబు వారికి సర్దిచెప్పారు. చివరి నిమిషం వరకు ప్రయత్నం చేద్దామని నచ్చ చెప్పారు. ఇదే సమయంలో సొంత జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు..నాని ద్వయం వంశీ నివాసానికి వెళ్లారు. సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఇంతకీ వారు తెచ్చిన సందేశం ఏంటి..ఏమి హామీ ఇచ్చారు. వంశీ ఏం చేయబోతున్నారు...
వంశీ తేల్చిచెప్పేసారు.. : సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక: ముహూర్తం ఇదే..!
వంశీ నివాసానికి ఇద్దరు మంత్రులు..
తొలి నుండి వంశీతో టచ్ లో ఉంటూ టీడీపీ నుండి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న మంత్రులు కొడాలి నాని..పేర్ని నాని ఇద్దరూ వంశీ నివాసానికి వెళ్లారు. సుదీర్ఘంగా భేటీ అయ్యారు. విజయవాడ లో రాష్ట్ర అవతరణ వేడుకలు ముగిసిన తరువాత వారిద్దరూ వంశీ నివాసానికి వెళ్లటం..సుదీర్ఘంగా మంతనాలు జరపటం చర్చనీయాంశంగా మారింది. గత వారం వంశీ ఈ ఇద్దరు మంత్రుల సమక్షంలోనే సీఎం జగన్ ను కలిసారు. ఆ తరువాత ముఖ్యమంత్రితో కొద్ది సేపు ఒన్ టు ఒన్ సమావేశమయ్యారు. అప్పటి నుండి ఆయన టీడీపీ వీడటం ఖాయమని..వైసీపీలో చేరుతున్నారని ప్రచారం మొదలైంది. దీనిని తగిన విధంగానే వంశీ టీడీపీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపారు. అయితే, చంద్రబాబు సైతం తిరిగి సమాధానం పంపుతా వంశీని పార్టీ నుండి వారించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో గన్నవరం లోని వైసీపీ నేతలు కొందరు వంశీ రాకకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో..మొత్తం వ్యవహారం పైన మంత్రులిద్దరూ వంశీతో సమావేశమై చర్చలు చేసారు. రాజకీయ భవిష్యత్ పైన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
వంశీకి దక్కిన హామీ ఏంటి...
వంశీ టీడీపీకి రాజీనామా చేసిన తరువాత కూడా.. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ పార్టీ వీడకుండా ఒత్తిడి చేస్తున్నారు. కేశినేని నాని..కొనకళ్ల నారాయణ ద్వారా వంశీతో మంతనాలు సాగిస్తున్నారు. అయితే, ఆ ఇద్దరు నేతలు ఇప్పటికే చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది. వంశీ ఇక పార్టీలో ఉండరనే నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో గన్నవరం సమీక్షలో సైతం కొందరు నేతలు వంశీతో చర్చలు చేయాల్సిన అవసరం లేదని వాదించగా..చంద్రబాబు నచ్చ చెప్పారు. చివరి నిమిషం వరకు ప్రయత్నిద్దామని చెప్పుకొచ్చారు. అయితే, తన మీద టీడీపీ నుండి వస్తున్న ఒత్తిడి..వైసీపీ గన్నవరం నేతల నుండి వస్తున్న వ్యతిరేకత గురించే ఈ సమావేశంలో మంత్రులిద్దరితోనూ వంశీ చర్చించినట్లుగా సమాచారం. అయితే, వైసీపీ నేతల నుండి ఎటువంటి ఇబ్బంది ఉండదని మంత్రులు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న వెంకటరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా మంత్రులు చెప్పినట్లు సమాచారం. అదే విధంగా వైసీపీలో రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీలో ఎప్పుడు చేరాలనే దాని పైనా చర్చ చేసినట్లు సమాచారం.
వంశీ వ్యాఖ్యలతో గందరగోళం..చేరిక ఖాయమేనా
మంత్రులతో సమావేశంలోనే వంశీ చంద్రబాబుకు రాసిన లేఖలో వైసీపీ వేధింపులకు గురి చేస్తుందంటూ చేసిన వ్యాఖ్యల పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీని డామేజ్ చేసే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రులిద్దరూ అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే, చివరకు వంశీ మాత్రం వైసీపీలో చేరటానికి సిద్దంగా ఉన్నానని చెప్పినట్లుగా సమాచారం. తొలుతు ఈ నెల 3 లేదా 4వ తేదీన వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందని వంశీ అనుచరులు చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ నెల 7న వంశీ పార్టీలో చేరుతారని అంటున్నారు. ఇక, వంశీ కార్యాలయం వద్ద టీడీపీ జెండాలు.. ఫ్లెక్సీలు తొలిగించారు. ఆయన ప్రధాన అనుచరులు ఆయనతో పాటే పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. ఎటువంటి ట్విస్ట్ లు లేకపోతే..వంశీ వారం లోగా పార్టీ మారటం ఖాయమని తెలుస్తోంది.