నారా భువనేశ్వరిపై రోజా తీవ్ర వ్యాఖ్యలు.. తండ్రి ఎన్టీఆర్ కే అన్నం పెట్టలేదు అంటూ
రాజధాని ఎర్రబాలెం లో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు రైతుల దీక్షలో చేసిన వ్యాఖ్యలపై, అలాగే చేతిగాజులు తీసి అమరావతి పరిరక్షణా సమితికి ఇచ్చి అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని టార్గెట్ గా చేసుకుని నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు .
పోలీసుల బూట్లు తుడిచి .. వచ్చి వెళ్ళే వాహనాలు శుభ్రం చేసి .. రాజధాని రైతుల వినూత్న నిరసన
రాజధాని రైతుల దీక్షలో పాల్గొన్న భువనేశ్వరి
రాజధాని అమరావతి కోసం సాగుతున్న పోరాటంలో భాగంగా ఎర్రబాలెంలో రైతుల దీక్షకు మద్దతు తెలిపి వారితో పాటు దీక్షలో పాల్గొన్నారు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు. ఇద్దరూ రైతులకు భరోసా ఇచ్చారు. అండగా ఉంటామని చెప్పారు. అంతే కాదు చంద్రబాబు అమరావతి కోసం, పోలవరం కోసం పరితపించారని చెప్పిన ఆమె ఇంతమంది మహిళలు రోడ్డుపైకి రావడం తొలిసారి చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి జేఏసీకి తన చేతి గాజు విరాళంగా ఇచ్చి భరోసా ఇచ్చారు .
భువనేశ్వరిని టార్గెట్ చేస్తున్న వైసీపీ మంత్రులు ... రివర్స్ కౌంటర్ ఇస్తున్న టీడీపీ
ఇక ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు భువనేశ్వరిని టార్గెట్ చేసి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్నటిని నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి రాజధాని అమరావతి కోసం భువనేశ్వరి గాజులు కాదు ఇవ్వాల్సింది తీసుకున్న భూములు తిరిగి ఇచ్చేయ్యాలని విమర్శలు చేశారు. ఇక వరుసగా భువనేశ్వరిపై విమర్శలు చేస్తున్న వైసీపీ మంత్రులు చంద్రబాబు భువనేశ్వరితో రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక టీడీపీ నేతలు సైతం వైసీపీ నేతల వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు.
తండ్రికి అన్నం పెట్టలేదని భువనేశ్వరిపై రోజా ఆరోపణలు
పుష్ప శ్రీవాణి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అనిత కౌంటర్ ఇచ్చారు. టిక్ టాక్ లు చెయ్యటం కాదు పాలన చెయ్యటం అంటే అంటూ మండిపడిన అనిత భువనేశ్వరి అనే స్థాయి కాదని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఇక తాజాగా వైసీపీ నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా భువనేశ్వరి గురించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు చివరి రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ కే అన్నం పెట్టలేని భువనేశ్వరి, తన గాజులు తాకట్టుపెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట అంటూ ఎద్దేవా చేశారు.
భువనేశ్వరి రాజధాని పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఆగ్రహం
గతంలో ఎన్నడూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజకీయాల్లోకి రాలేదు. పెద్దగా మాట్లాడనూ లేదు. ఇక తాజాగా రాజధాని ప్రాంత రైతుల దీక్షలో మాత్రం ఆమె బాగానే మాట్లాడారు. చంద్రబాబు ఏపీ కోసం కన్న కలల్ని ఆమె ప్రజల ముందు చెప్పారు. తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు. రాజధాని అమరావతి చంద్రబాబు స్వప్నం అని అహర్నిశలు అలోచించేవారని ఆమె తెలిపారు.ఇక ఇదే వైసీపీ నేతలకు నచ్చటం లేదు .