ఆ పదవి వద్దు బాబోయ్..! స్పీకర్ పదవి అనగానే రన్ రాజా రన్ అంటున్న వైసీపి ఎమ్మెల్యేలు..!!
అమరావతి/హైదరాబాద్ : శాసన సభాపతి పదవికి ఒకరిద్దరు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. బాపట్ల నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోన రఘుపతి పేరు ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరొందిన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు కూడా గతంలో కొద్దికాలం శాసనసభ స్పీకర్గా పని చేశారు. అదే నియోజకవర్గం నుంచి 1967, 1972, 1978 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి 1980 నుంచి 81 వరకు ఏపీ శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. ఆ తరువాత ఆయన కీలక శాఖలకు మంత్రిగానే కాకుండా పాండిచ్చేరి, సిక్కిం, మహారాష్ట్ర గవర్నర్ కూడా పని చేశారు. ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన రఘుపతి పేరు స్పీకర్ పదవికి పరిశీలనలో ఉందన్న చర్చ నడుస్తోంది.
పరిశీలనలో కోన, సుచరిత..! విముఖత వ్యక్తం చేస్తున్న నేతలు..!!
అలాగే మహిళలకు ఇవ్వాలని భావిస్తే ప్రత్తిపాడు నుంచి మూడో పర్యాయం విజయం సాధించిన మేకతోటి సుచరితను స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వినికిడి. 2009లో కాంగ్రెస్ తరఫున.. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున.. ఈ ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది జిల్లాలో సీనియర్ల సరసన చేరారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సుచరితలే జిల్లాలో సీనియర్లుగా ఉన్నారు. వాస్తవానికి సుచరితకు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ ఇదే లోక్సభ స్థానం పరిధిలోని మంగళగిరి నుంచి గెలుపొందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్పై గెలుపొందిన ఆళ్లకు మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల సమయంలోనే వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో సుచరితకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కానప్పుడు స్పీకర్ పదవికి ఆమె పేరును పరిశీలించే అవకాశం ఉందంటున్నారు.
అంబటిపైనా అంచనాలు..! రాంబాబు మనసులో ఏముందో..!!
ఇక సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి టీడీపీ సీనియర్ నేత, స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై విజయం సాధించిన వైసీపీ నేత అంబటి రాంబాబు పేరు కూడా స్పీకర్ పదవికి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ తరఫున అంబటి గెలవడం తొలిసారే అయినప్పటికీ గతంలో కూడా ఆయన ఒకసారి కాంగ్రెస్ తరఫున రేపల్లె నుంచి పోటీ చేసి గెలుపొందారు. దాదాపుగా పాతికేళ్ల తర్వాత తిరిగి చట్ట సభలోకి అడుగు పెట్టే అవకాశం దక్కింది. వాగ్దాటి కలిగిన నేతగా పేరొందిన అంబటి రాంబాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ముందుకురాని నేతలు..! కసరత్తు చేస్తున్న అదిష్టానం..!!
అయితే వీరెవరూ కూడా ఇష్టంగా స్పీకర్ పదవిని చేపట్టేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇందుకు జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి స్పీకర్ పదవి చేపట్టిన వారు శాసనసభకు దూరమవుతూ వస్తున్న ఆనవాయితీ వారిని భయపెడుతోంది. తెనాలి నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన నాదెండ్ల మనోహర్ రెండోసారి విజయం సాధించిన తరువాత తొలుత డిప్యూటీ స్పీకర్గా, ఆ తరువాత స్పీకర్గా వ్యవహరించారు. ఆ పదవి చేపట్టిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి ఘోర పరాజయం చవిచూశారు. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగినప్పటికీ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక తాజా మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుదీ అదే పరిస్థితి.
స్పీకర్ గా చేసిన వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదనే అపోహ..! కాదంటున్న నేతలు..!!
ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ స్పీకర్ పదవి చేపట్టేందుకు ఉత్సాహం చూపడం లేదు. గతంలో జిల్లా నుంచి స్పీకర్ పదవి నిర్వహించిన నిశ్శంకరరావు వెంకటరత్నం, కోన ప్రభాకరరావు కూడా తిరిగి అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. వెంకటరత్నం 1972, 1983 ఎన్నికల్లో గుంటూరు రెండో నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1984 నుంచి 1985 వరకు శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. ఆ తరువాత తిరిగి అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం దక్కలేదు. కోన ప్రభాకరరావు కూడా 1978లో మూడోసారి గెలుపొందిన తరువాత స్పీకర్గానే కాకుండా మంత్రి పదవులను కూడా నిర్వహించినప్పటికీ తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కలేదు. అయితే ఆ తరువాత పలు రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించే అవకాశమైతే దక్కింది.